ఎన్టీఆర్ జిల్లా/ఇబ్రహీంపట్నం, మార్చి 15, 2025
మనిషి చేసే చిన్న తప్పు తన మనుగడకే పెద్ద ముప్పు
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకుండా సంకల్పించుకుందాం
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞలో ప్రతి పదాన్ని సరైన విధంగా అర్థం చేసుకొని ముందుకు కదులుదాం
భూ పరిపాలన చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఏ), జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి, కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్
మనిషి చేసే చిన్న తప్పు.. తన మనుగడకే పెద్ద ముప్పు అని.. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ను వినియోగించకుండా మనం చేసే ఓ చిరు ప్రయత్నం భావి తరాలకు బంగారు భవిష్యత్తుకు నాంది అని భూ పరిపాలన చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఏ), ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి అన్నారు.
స్వచ్ఛాంధ్ర, హరితాంధ్ర, ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతినెలా మూడో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర దివస్ కార్యక్రమం శనివారం ఇబ్రహీంపట్నం మండలం, జూపూడిలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీసీఎల్ఏ జి.జయలక్ష్మి, కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి హాజరయ్యారు. తొలుత చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని సందర్శించి వర్మీ కంపోస్టు తయారీ, విక్రయాల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటి స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ప్రత్యేక గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకుండా మనం ఈరోజు చేసుకునే సంకల్పం భావితరాలకు, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. మనం ఒకరికి చెడుచేస్తే మనకూ చెడు జరుగుతుందని నమ్ముతాం.. మరి విచ్చలవిడిగా ప్లాస్టిక్ వస్తువులను వినియోగిస్తూ చేసే చెడు తప్పకుండా మనకు చెడు చేస్తుందన్నారు. మైక్రో ప్లాస్టిక్స్ రక్తంలో చేరి కేన్సర్ వంటి రోగాలకు కారణమవుతున్నాయని అధ్యయనాల్లో వెల్లడైందని.. జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ నిషేధం అనే ఓ బృహత్తర కార్యక్రమం విజయవంతంగా అమలుచేయడంలో మహిళలతో పాటు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అగ్రికల్చర్ సైంటిస్ట్ అయిన కలెక్టర్ లక్ష్మీశ.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగం దుష్పరిణామాలను చాలా బాగా వివరించారని పేర్కొన్నారు. వీటి భావాన్ని సరైన విధంగా అర్థం చేసుకుంటూ మంచి ఆలోచనతో పర్యావరణ హిత సమాజం దిశగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
మన ప్రవర్తనలో మార్పు రావాలి: కలెక్టర్ లక్ష్మీశ
కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి నుంచి ప్రతినెలా మూడో శనివారం ఒక ఇతివృత్తంతో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని.. ఈ నెల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ప్రధాన అంశంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రులు, పారిశ్రామిక యూనిట్లు, పాఠశాలలు, కాలేజీలు, బస్టాండ్లు, మార్కెట్యార్డులు, ప్రభుత్వ కార్యాలయాలు.. ఇలా ప్రతిచోటా స్వచ్ఛతా పరిమళాలు వెల్లివిరియాలని.. స్వచ్ఛత ఔన్నత్యాన్ని చాటిచెప్పడంతో పాటు సింగిల్ యూజి్ ప్లాస్టిక్ను వినియోగించకుండా పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు వంటివి నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్లాస్టిక్ అనేది భూమిలో కనీసం 400 ఏళ్లపాటు అలానే ఉండిపోయి ఆపై మైక్రో ప్లాస్టిక్స్గా మారి వివిధ మార్గాల ద్వారా మన శరీరంలో చేరి ఆరోగ్యాన్ని ఛిద్రం చేస్తుందన్నారు. అందువల్ల క్లాత్ బ్యాగులు, జ్యూట్ బ్యాగులు వంటి వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. ఉదాహరణకు చికెన్ దుకాణానికి వెళ్లినప్పుడు పాలిథిన్ సంచుల్లో కాకుండా మనమే బాక్సు తీసుకెళ్లి చికెన్ తెచ్చుకునే క్రమశిక్షణ ఓ పెద్ద మార్పునకు దోహదం చేస్తుందన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వినియోగించకుండా మన ప్రవర్తనలో మార్పు రావాలని పేర్కొన్నారు.
ఉద్యమంగా ముందుకుతీసుకెళ్దాం: శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు వినియోగించకుండా, వినియోగించనీయకుండా ఓ ఉద్యమంగా ముందుకుతీసుకెళ్దామని.. మరో మంచి కార్యక్రమం జూపూడి నుంచి ప్రారంభం కావడం ఆనందంగా ఉందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. గతంలో ప్లాస్టిక్ భూతం లేదని.. ఇప్పుడు అది మనల్ని చుట్టుముట్టేస్తోందని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వినియోగంపై గట్టి నియంత్రణకు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై కృషిచేయనున్నట్లు తెలిపారు. మనం ఇప్పుడు మేలుకోకుంటే మన భావితరాలకు పెద్ద ముప్పు తప్పదని హెచ్చరించారు.
కార్యక్రమంలో భాగంగా సీసీఎల్ఏ, కలెక్టర్, శాసనసభ్యులు.. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి క్లాప్ మిత్రాలను సత్కరించారు. ఈ రోజు నుంచి గ్రామంలో ఎలాంటి సింగిల్యూజ్ ప్లాస్టిక్ వస్తువూ వినియోగించం అని గ్రామసభలో తీర్మానించారు.
ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దడంలో నా వంతు కృషిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను.. అంటూ కలెక్టర్ లక్ష్మీశ కార్యక్రమానికి హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులు, గ్రామ ప్రజలతో కలిసి స్వచ్ఛతా ర్యాలీ నిర్వహించారు. ఓ జనరల్ స్టోర్కు వెళ్లి స్టోర్ యజమానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వస్తువుల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. పాలిథిన్ సంచులు ఉపయోగించకుండా క్లాత్ బ్యాగులు, నార బ్యాగులు వంటి పర్యావరణహిత సంచులను ఉపయోగించేలా ప్రోత్సహించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర స్టిక్కర్లను అతికించారు.
కార్యక్రమంలో విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న, సర్పంచ్ కె.దేవమాత, డీపీవో పి.లావణ్య కుమారి, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.