మట్టి గణపతి మహా గణపతి
పర్యావరణహితంగా వినాయక చవితి చేపట్టాలన్నదే
పవన్ కళ్యాణ్ ఆకాంక్ష
పిఠాపురంలో పైలెట్ ప్రాజెక్ట్ గా మట్టి విగ్రహాల తయారీ
సర్వ విఘ్నాలు తొలగించే దైవంగా వినాయకుడు తొలి పూజలు అందుకొంటాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత వస్తున్న తొలి పండుగ వినాయక చవితి. ఈ వేడుకను పర్యావరణహితంగా చేసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేస్తున్న విగ్రహాలు కాలుష్యానికి కారణం అవుతున్నాయి. జలాశయాలు, నదులు, కాలువలలోకి రసాయనాలు చేరుతున్నాయి. మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా జల కాలుష్యాన్ని అరికట్టవచ్చు. ఆ సదుద్దేశంతో మట్టి గణపతిని పూజించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అందులో భాగంగానే మట్టి విగ్రహాల తయారీకి శిక్షణ కూడా ఇప్పించారు. ఇందుకు సంబందించిన పైలెట్ ప్రాజెక్టును రెండు నెలల కిందట పిఠాపురంలో మొదలుపెట్టారు. పిఠాపురంలోని తన నివాసం వద్దే ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గత రెండు నెలల్లో అయిదు అడుగుల మట్టి వినాయకుని ప్రతిరూపాలు 50, మూడు అడుగులవి 80 తయారు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచారు. అలాగే పర్యావరణానికి నష్టం కలగకుండా క్లాత్ బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది డిసెంబర్ లోగా పిఠాపురంలో ఈ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వారికి విగ్రహాల తయారీపై నైపుణ్య శిక్షణ అందించనున్నారు, తద్వారా వచ్చే సంవత్సరం వేడుకలకు మట్టితో చేసిన వినాయకుని ప్రతిమలు విరివిగా ఉపయోగించేలా చూడాలనీ, ఈ విగ్రహాల తయారీ ద్వారా స్థానిక కుల వృత్తి ఆధారిత ప్రజల జీవనోపాధులు మెరుగుపరచవచ్చనీ పవన్ కళ్యాణ్ భావించారు.