*విజయవాడ తేది 29.05.2025* మండల లెవల్ స్టాక్ పాయింట్ నుండి (ఎంఎల్ఎస్) నుండి రేపటిలోగా నిత్యావసర సరుకుల పంపిణీ పూర్తి చేసి రేషన్ దుకాణాల నుండి సరుకుల పంపిణీ చేసేందుకు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. జూన్ 1వ తేదీ నుండి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ పున:ప్రారంభం నేపథ్యంలో గురువారం విజయవాడ రూరల్ గొల్లపూడి ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద సరుకుల లోడిరగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గొల్లపూడి ఎంఎల్ఎస్ పాయింట్ గోదాములో ఉన్న నిత్యవసర సరుకులను పరిశీలించి, ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి చౌక ధరల దుకాణాలకు సరుకుల పంపిణీ, రవాణా ఛార్జీలు, హమాలీలకు చెల్లింపులు తదితర వివరాలను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విజయవాడ, మైలవరం, నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట, తిరువూరు, విసన్నపేట, ఎంఎల్ఎస్ పాయింట్ల పరిధిలో 957 రేషన్ దుకాణాల ద్వారా సుమారు 8,929 టన్నుల బియ్యాన్ని, సుమారు 260 టన్నుల పంచదార కార్డుదారులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో జూన్ 1వ తేదీ నుండి రేషన్ దుకాణాల ద్వారా పారదర్శకంగా కార్డు దారులకు నిత్యావసర సరుకుల పంపిణీని పున:ప్రారంభించిందన్నారు. ఇప్పటికే రేషన్ దుకాణాల డీలర్లు, అసోసియేషన్ ప్రతినిధులు, పౌర సరఫరాల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. రేషన్ దుకాణాల ద్వారా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు రేషన్ పంపిణీకి చర్యలు తీసుకునేలా ఆదేశించామన్నారు. దివ్యాంగులు, 65 సంవత్సరాల పైబడిన వృద్దులకు ఇంటి వద్ద రేషన్ సరుకులు పంపణీకి చర్యలు తీసుకున్నామన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ గోదాము నుండి రేషన్ దుకాణాలకు సరుకుల పంపిణీలో ఎటువంటి అవకతవకలకు పాల్పడిన తక్షణమే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ హెచ్చరించారు. తనిఖీలో కలెక్టర్ వెంట డిఆర్వో ఎం. లక్ష్మీనరసింహం సంబంధిత అధికారులు ఉన్నారు.
