రాష్ట్రంలో ఆయుష్ రంగంలో మెడికల్ టూరిజానికి మంచి అవకాశాలు
భారతీయ, ఆధునిక వైద్య విధానాల మేళవింపుతో సమీకృత ఆసుపత్రుల ఏర్పాటులో పెట్టుబడులకు అవకాశం
ఆయుష్కు ప్రధాని మోడీ చేయూతనిస్తే… జగన్రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం చేశారు
రాష్ట్రంలో ఆయుష్ రంగం పునరుజ్జీవనానికి కృషి చేస్తున్నాం
ఆయుష్పై జాతీయ సదస్సులో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి, మే1
2014 నుంచి దేశంలో ఆయుష్ వైద్య సేవల విస్తరణలో నవశకం ప్రారంభమయ్యిందని, ఈ రంగంలో ఉన్న అవకాశాలను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకునేందుకు రాష్ట్రాలు ద్విగుణీకృత ప్రయత్నాలు చేయాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఆయుష్ రంగ విశిష్టత, సేవల వ్యాప్తి మరియు పెట్టుబడి అవకాశాలపై కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పూణె సమీపంలోని లోనావాలా వద్ద గురువారంనాడు
ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సదస్సులో మంత్రి పాల్గొన్నారు.
ప్రాచీన భారతీయ వైద్య విధానాల విశిష్టతపై అవగాహన కలిగిన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఆయుష్ వైద్య విధానాల్ని ప్రోత్సహించడానికి 2014 నుంచి నడుంకట్టారని, దీని వల్ల సత్ఫలితాలొస్తున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. భారతీయ, అల్లోపతి వైద్య విధానాల మేళవింపుతో, సమీకృత ఆసుపత్రుల ఏర్పాటుతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ఈ రెండిటి మేళవింపుతో రాష్ట్రంలో ఆసుపత్రుల్ని స్థాపించడానికి పెట్టుబడుల సమీకరణతో పాటు మెడికల్ టూరిజంను అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాల దృష్ట్యా దీనిపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని మంత్రి తెలిపారు. భారతీయ వైద్య విధానానికి కేరళలో లభిస్తున్న ఆదరణను, తద్వారా కలుగుతున్న ప్రయోజనాల్ని ఆయన ప్రస్తావించారు.
కేంద్రం మద్దతుతో రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవల్ని విస్తృతం చేసి ప్రజలకు భారీ ఎత్తున అందుబాటులోకి తెచ్చే సదవకాశం ఉన్నా 2019-24 కాలంలో అప్పటి ప్రభుత్వం ఈ రంగాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రంగం పట్ల రాష్ట్ర నిరాసక్తత కారణంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదని, ఇతర రాష్ట్రాలు బాగా లబ్ది పొందాయని మంత్రి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మొదటి రెండేళ్లలో ఆయుష్ రంగంలో కేవలం నామ మాత్రంగా నిధులు ఖర్చు చేశారని, ఆఖరు మూడేళ్లలో ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. ఆయుష్ వైద్యులు ఇతర పోస్టుల్లో భారీగా ఖాళీలు ఉండడం వల్ల ఆయుష్ సేవల్ని పూర్తి స్థాయిలో అందించలేకపోతున్నామన్న విషయం సమీక్షా సమావేశాల్లో వెల్లడైందని మంత్రి తెలిపారు. ఈ విధంగా కుదేలైన ఆయుష్ రంగానికి కూటమి ప్రభుత్వం జీవం పోయడానికి కృషి చేస్తోందని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ సదస్సులో వివరించారు. గత ప్రభుత్వ ఐదేళ్ల హయాంలో ఆయుష్ రంగానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి కేవలం రూ.37 కోట్లు మాత్రమే లభించగా, కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరమైన 2024-25కి కేంద్రం నుంచి రూ. 87 కోట్లు తెచ్చుకోగలిగిందని, 2025-26 వార్షిక ప్రణాళిక కింద రూ.150 కోట్లు ప్రతిపాదించామని మంత్రి తెలిపారు.