*ఎన్టీఆర్ జిల్లా, సెప్టెంబర్ 26, 2024*
బుకింగ్ అయిన వెంటనే ఇసుక రవాణాకు చర్యలు తీసుకోండి
జిల్లాలో సమర్థవంతంగా ఏపీ ఇసుక నిర్వహణ వ్యవస్థ (ఏపీఎస్ఎంఎస్) అమలు
కలెక్టర్ డా. జి.సృజన
ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా బుకింగ్ చేసుకున్న వెంటనే సరైన రవాణాతో ఇసుక సరఫరా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని.. ఇసుక రవాణా వాహనదారులతో పటిష్ట సమన్వయంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన ఆదేశించారు.
నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉచిత ఇసుక విధానం అమలుపై గురువారం కలెక్టర్ జి.సృజన.. జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనాతో కలిసి గనులు భూగర్భ, రవాణా, ఇసుక లారీల యజమానుల సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆలస్యం లేకుండా త్వరితగతిన ఇసుక రవాణా జరిగేలా ఇసుక రవాణా వాహనదారులు జిల్లా యంత్రాంగానికి సహకరించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అత్యంత పారదర్శకంగా జిల్లాలో ఉచిత ఇసుక సరఫరా విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. రీచ్ నుండి వినియోగదారుల ఇంటి వద్దకే ఇసుకను రవాణా చేసిన వాహనాలకు జాప్యం లేకుండా సంబంధిత రుసుమును ప్రభుత్వ నుంచి నేరుగా ఖాతాలో జమచేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఇసుక రవాణాకు ఆసక్తి కలిగిన వాహనాలను ఏపీ శాండ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. వాహనాలను రిజిస్టర్ చేసుకోవడానికి ఎటువంటి పరిమితి లేదన్నారు. నగరంలోని ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని రాత్రి సమయంలో ఇసుక రవాణా జరిగేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇసుక సరఫరా కేంద్రం నుండి రవాణా జరిగే ప్రాంతం మధ్య దూరానికి సంబంధించిన రవాణా చార్జీలను, నిర్వహణ ఖర్చులను మాత్రమే తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రస్థాయిలో ఇసుక రవాణాలో ఇటీవల తీసుకున్న నిర్ణయాలు, బుకింగ్ అనంతరం ఇంకనూ సరఫరా చేయాల్సిన ఇసుక రవాణా, ఫెసిలిటేషన్ కేంద్రాలలో గుర్తించిన సమస్యలు, ఐ వి ఆర్ ఎస్ రిపోర్టు స్టేటస్, జీఎస్టీ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
సమావేశంలో గనులు భూగర్భ శాఖ సహాయ సంచాలకులు వీరాస్వామి, ట్రాఫిక్ ఏఎస్పీ ప్రసన్నకుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కె.వెంకటేశ్వరరావు, పీవీ రమణారావు, శాండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు.