జనాభాలో సగానికి పైగా ఉండే వెనుకబడిన తరగతుల వారి సమగ్రాభివృద్ధికి నేటి తరుణంలో చేపట్టవలసిన చర్యలతో టీడీపీ-జనసేన కూటమి బీసీ డిక్లరేషన్ రూపొందించింది. రేపు (మార్చి 5) మంగళవారం నాడు ‘బీసీ డిక్లరేషన్’ ను కూటమి విడుదల చేయనుంది. దీనికోసం ‘జయహో బీసీ’ సదస్సును గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, టీడీపీ బీసీ సాధికార కమిటీ ఛైర్మన్ కొల్లు రవీంద్రతో పాటు రెండు పార్టీలకు చెందిన అగ్ర నాయకులు, కార్యకర్తలు సదస్సులో పాల్గొంటారు.
రేపు విడుదల చేయనున్న ‘బీసీ డిక్లరేషన్’ కు సంబంధించిన వివిధ అంశాలను చర్చించేందుకు ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయంలో యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దాదాపు 3 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, దువ్వారపు రామారావు, పంచుమర్తి అనురాధ, కాల్వ శ్రీనివాసులు, బీద రవిచంద్రయాదవ్, వీరంకి గురుమూర్తి, జనసేన నాయకులు పోతిన మహేశ్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఇతర నాయకులు, వివిధ బీసీ కులాల ప్రతినిధులు పాల్గొన్నారు.