బీసీలు తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలు.
జగన్మోహన్ రెడ్డి బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు.
కొండపల్లిలో పోలీసు శాఖ స్థలం బీసీ హాస్టల్ కు ఇవ్వాలి.
మంత్రి అనితమ్మ , మంత్రి సవితమ్మ ఈ సమస్యపై తక్షణమే దృష్టి పెట్టాలి.
ఎన్టీఆర్ జిల్లాలో బీసీ బాలికలకు ప్రత్యేకంగా హాస్టల్ లేదు.
బీసీ బాలికలకు ప్రత్యేక గురుకుల పాఠశాల కేటాయించాలి.
-ఏపీ అసెంబ్లీలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు
ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి, 20.03.2025.
బీసీలు తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలని, బటన్ నొక్కితే చాలు అని, నా పని అయిపోయిందనే ఉద్దేశ్యంతో మహానుభావుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గురువారం ఉదయం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో బీసీ విద్యార్థుల చదువుల కోసం 65 పాఠశాలలను మంజూరు చేయడం జరిగిందన్నారు. తదనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వాటికి మౌలిక వసతుల కల్పనకు కనీస నిధులు కూడా మంజూరు చేయలేదన్నారు.
కొండపల్లిలో బీసీ విద్యార్థులు బాలుర పాత హాస్టల్ లో 480 మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ఇక్కడ 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం ఉందన్నారు. ఇక్కడ ఇంకా మౌలిక వసతులు కల్పించాలన్నారు. అదనపు తరగతి గదులు నిర్మించాలన్నారు. ఇక్కడ 8, 9 తరగతులకు కేవలం ఒకే ఒక్క సెక్షన్ ఉందన్నారు. పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారన్నారు. వాళ్లందరికీ సరైన సౌకర్యాలు కల్పించలేక పోతున్నామన్నారు. ఇక్కడ అదనపు గదులు, డార్మిటరీ, వంటశాల నిర్మించాలన్నారు. ఈ పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుకునే అవకాశం కల్పించాలని అన్నారు.
కొండపల్లిలో బీసీ హాస్టల్ పక్కనే పోలీసు శాఖకు చెందిన స్థలం ఉందన్నారు. దీన్ని బీసీ హాస్టల్ విస్తరణకు కేటాయించాలన్నారు. హోంమంత్రి శాఖ మాత్యులు అనితమ్మ, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు సవితమ్మ ఈ సమస్యపై స్పందించాలన్నారు. బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి వారన్నారు. వారికోసం అక్కడ స్థలాన్ని బీసీల పిల్లల చదువుల కోసం కేటాయించాలన్నారు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ జిల్లాలో బీసీ బాలికలకు ప్రత్యేకంగా వసతి గృహం లేదన్నారు. మైలవరం నియోజకవర్గంలో తక్షణం బీసీ బాలికలకు గురుకుల పాఠశాల మంజూరు చేయాలన్నారు. ఇందుకు అనువైన స్థలం కూడా సిద్ధంగా ఉందన్నారు. ఆయా సమస్యలపై ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు.