15-03-2025
ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలి ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి కేశినేని ఎమ్మెల్యే గద్దె
విజయవాడ : పర్యావరణానికి హానికరమైన 19 రకాల సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువులను ప్రభుత్వం నిషేధించిందని, ఆ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించాలి. పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే ప్రజల సహకారంతోనే సాధ్యం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కోరారు.
పోల్యూషన్ కంట్రలో బోర్డ్, ఆటోనగర్ ఐలా సంస్థ, నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం మహానాడు రోడ్ లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి పాల్గొన్నారు. ముందుగా అధికారులు, నాయకులు పర్యావరణాన్ని కాపాడతామని ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం నిషేధించిన 19 రకాల సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువులపై ప్రజలకు అవగాహన కలిగించే పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ , ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యావరణ పరిరక్షణం కోసం మొక్కలు నాటారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా వుంచటంలో ప్రజలందరూ మరింతగా బాధ్యతగా వుండాలన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కోసం ప్రజలు రోజుకు కొంత సమయం కేటాయించి పరిసరాలను పరిశుభ్రంగా వుంచాలని కోరారు. అదే విధంగా ప్రజలందరూ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి ,వాటి స్థానంలో పర్యావరణహితమైన సంచులను , వస్తువులను వాడటం అలవాట చేసుకోవాలన్నారు. తద్వారా కాలుష్యాన్ని తగ్గించే దిశలో ప్రయాణిస్తామని తెలిపారు.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పర్యావరణానికి హానికరంగా తయారైన సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను సమాజం నుంచి తరిమికొట్టాలంటే ప్రజల సహకారంతోనే సాధ్యం అన్నారు. మొక్కలు పెంపకం, పర్యావరణ పరిరక్షణ పై పిల్లలకు చిన్నప్పటి నుంచే అవగాహన పెంచాలన్నారు. ప్రతి ఒక్కరూ జూట్ సంచులను మాత్రమే వాడాలని, 120 మైక్రోన్లకంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లను వినియోగం పర్యావరణానికి హాని కలిగిస్తాయన్నారు.
ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ శ్రీనివాస్, జెడ్.ఎమ్.ఎ.పి.ఐ.ఐ.సి జోనల్ కమిషనర్ కె.బాబ్జీ, ఐలా మాజీ అధ్యక్షుడు సుంకర దుర్గా ప్రసాద్, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ లతో పాటు స్థానిక ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.