*11-03-2025*
ప్రభుత్వ పథకాలు వినియోగించుకుని ఎంటర్ ప్రెన్యూర్స్ గా రాణించాలి
తక్కెలపాడు గ్రామ ప్రజలతో పంచాయతీ ఛాంపియన్స్ సమావేశం
జగ్గయ్యపేట మండలం: గ్రామాలు అభివృద్ది చెందితేనే పట్టణాలు, రాష్ట్రాలు, ఆ తర్వాత దేశం అభివృద్ది పథంలో పయనిస్తుంది. అందుకే గ్రామాభివృద్ది తోపాటు గ్రామంలోని ప్రతి కుటుంబంలో ఒకరు పారిశ్రామికవేత్తగా మారి ఆర్థికాభివృద్ది సాధించేందుకు స్వయం ఉపాధి రంగాల్లో ప్రోత్సహించేందుకు ఎంపి కేశినేని శివనాథ్ ప్రోత్సహిస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ ) ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ జి.వి.నరసింహారావు అన్నారు.
విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) సహకారంతో కేశినేని ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ ఎన్ఐఆర్ డి పి ఆర్ లో శిక్షణ పొందిన పంచాయతీ ఛాంపియన్స్ మంగళవారం జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట మండలం తక్కెలపాడు గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.డి.పి.ఆర్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ జి.వి.నరసింహారావు, మండల సమైక్య అధ్యక్షురాలు గద్దె రాజలక్ష్మి మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలల కన్న గ్రామ స్వరాజ్యం గ్రామీణ మహిళల ఆర్థిక తోడ్పాటుతోనే సాధ్యపడుతుందని అందు కోసమే పంచాయతీ ఛాంపియన్స్ గా వారికి ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) శిక్షణ ఇప్పించారని చెప్పారు. గ్రామీణ మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడి స్వయం ఉపాధి ద్వారా వ్యాపారం వృద్ధి చేసుకుంటూ ఆర్థికాభివృద్ది సాధించేందుకు , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్వయం ఉపాధి పథకాలు, ప్రభుత్వం అందించే సబ్సిడీ గురించి మహిళలు,యువతకు పంచాయతీ ఛాంపియన్స్ అవగాహన కల్పించటంతో పాటు అండగా వుంటారని తెలిపారు.
ఎమ్.ఎస్.ఎమ్.ఈ రుణాల ద్వారా స్వయం ఉపాధి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు లక్ష రూపాయల నుంచి యాభై లక్షల రూపాయల వరకు సబ్సిడీ తో కూడిన లోన్ వస్తుందని తెలిపారు. ప్రత్యేకించి మహిళలు తీసుకునే ఈ రుణాలకు 45 శాతం సబ్సిడీ లభిస్తుందని వివరించారు.ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆర్థికాభివృద్ది సాధించేందుకు మహిళలు,నిరుద్యోగ యువత ఎంటర్ ప్రెన్యూర్స్ గా మారి రాణించాలని ఆకాంక్షించారు.
అలాగే ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పంచాయతీ ఛాంపియన్స్ ద్వారా గ్రామాల్లో వున్న నిరుద్యోగులకు వారికి ఆసక్తి వున్న రంగంలో సిల్క్ డెవలప్ సెంటర్స్ ద్వారా శిక్షణ ఇప్పించే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కసుకుర్తి శ్రీనివాసరావు, ఎ.పి.ఎమ్.సి.సి జ్యోతి, పంచాయతీ ఛాంపియన్స్ బి.సతీష్ నాయక్, షేక్ నాగుల్, కె.క్రాంతి కుమార్, తీగల రాజేష్, కొరివి సైదులు, పిల్లి చిట్టిబాబు, దోరేపల్లి బాల గోపి, పేరం రమేష్ లతో పాటు డ్వాక్రా మహిళా సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.