Home Andhra Pradesh ప్ర‌భుత్వాసుప‌త్రి వైద్యులు, సిబ్బంది ప‌నితీరులో మార్పు రావాలి

ప్ర‌భుత్వాసుప‌త్రి వైద్యులు, సిబ్బంది ప‌నితీరులో మార్పు రావాలి

5
0

ఎన్‌టీఆర్ జిల్లా, మే 21, 2025

ప్ర‌భుత్వాసుప‌త్రి వైద్యులు, సిబ్బంది ప‌నితీరులో మార్పు రావాలి

  • టీమ్ జీజీహెచ్ స్ఫూర్తితో ప‌నిచేయాలి
  • రోగుల‌కు సేవ‌లందించి మ‌న్న‌న‌లు పొంద‌డంలో అగ్ర‌స్థానంలో నిల‌వాలి
  • సేవ‌లు అందించ‌డంలో అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు
  • ఆసుప‌త్రిలో పారిశుద్ధ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌పెట్టండి
  • జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

అనారోగ్యానికి గురై చేతిలో చిల్లిగ‌వ్వ‌లేని ప‌రిస్థితిలో నిరుపేద‌లు వైద్యం కోసం ప్ర‌భుత్వాసుప‌త్రుల‌కు వ‌స్తార‌ని.. అలాంటి వారికి మెరుగైన వైద్య సేవ‌లు అందించ‌డం దైవ‌సేవ‌తో స‌మాన‌మ‌ని, రోగుల‌కు మెరుగైన వైద్య సేవ‌లందించ‌డంలో ప్ర‌భుత్వాసుప‌త్రిని అగ్ర‌స్థానంలో నిల‌పాల‌ని, టీమ్ జీజీహెచ్ స్ఫూర్తితో ప‌నిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ వైద్యాధికారుల‌ను ఆదేశించారు.
ప్ర‌భుత్వ స‌ర్వ‌జ‌న ఆసుప‌త్రి అభివృద్ధి సొసైటీ (హెచ్‌డీఎస్‌) స‌మావేశం బుధ‌వారం సొసైటీ ఛైర్మ‌న్‌, క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించారు. స‌మావేశంలో ప్ర‌భుత్వాసుప‌త్రిలో చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించి, ప‌లు ప్ర‌తిపాద‌న‌ల‌కు ఆమోదం తెలిపారు. అనంత‌రం జిల్లా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుప‌త్రుల‌కు దీటుగా వైద్య సేవ‌లు అందించాల‌న్న ప్ర‌భుత్వ ల‌క్ష్యాన్ని నెర‌వేర్చ‌డంలో ప్ర‌తిఒక్కరూ అంకిత‌భావంతో ప‌నిచేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌భుత్వాసుప‌త్రుల ప‌నితీరుపై సేక‌రించిన ప్ర‌జాభిప్రాయ నివేదిక ప్ర‌కారం విజ‌య‌వాడ స‌ర్వ‌జ‌నాసుప‌త్రికి ఇచ్చిన నివేదిక‌లో వైద్యులు అందిస్తున్న వైద్య సేవ‌లు, సిబ్బంది ప‌నితీరు, మందుల స‌ర‌ఫ‌రా, పారిశుద్ధ్యం, అవినీతి ర‌హిత సేవ‌లు ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డం అత్యంత బాధాక‌ర‌మైన విష‌య‌మ‌న్నారు. ఈ విష‌యంపై వైద్యాధికారులు పున‌రాలోచ‌న చేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. స‌మావేశాలు మౌలిక వ‌స‌తుల అభివృద్ధి ప‌నుల‌కే ప‌రిమితం కాకూడ‌ద‌ని.. అభివృద్ధితో పాటు వైద్యులు, సిబ్బంది అందించే సేవ‌లు పేద రోగుల‌కు సంతృప్తిక‌రంగా ఉన్న‌ప్పుడే ఆశించిన ఫ‌లితాలు సాధించి ప్ర‌జాభిప్రాయంలో అగ్ర‌స్థానంలో నిలిచేందుకు అవ‌కాశ‌ముంటుంద‌న్నారు.
ఇది ఏ ఒక్క‌రి బాధ్య‌త కాద‌ని.. అన్ని విభాగాధిప‌తులు, సిబ్బంది స‌మ‌ష్టి కృషిగా టీమ్ జీజీహెచ్ స్ఫూర్తితో ప‌నిచేయాల‌ని ఆదేశించారు. అనారోగ్యం బారిన‌ప‌డి ప్రైవేటు ఆసుప‌త్రుల్లో ఖ‌ర్చుపెట్టి వైద్యం చేయించుకోలేక ఎంతోన‌మ్మ‌కంతో ప్ర‌భుత్వాసుప‌త్రుల‌కు వైద్యం కోసం వ‌చ్చేవారిని ముందు ఆప్యాయ‌త‌తో ప‌ల‌క‌రించి, వారికి మ‌నోధైర్యం క‌లిగించిన‌ప్పుడు స‌గం రోగం న‌యం చేసిన‌ట్ల‌వుతుంద‌న్నారు. పేద‌ల‌కు అందించే వైద్యసేవ‌లు దేవుని సేవ‌తో స‌మాన‌మ‌నే భావ‌న వైద్యులు, సిబ్బందికి క‌ల‌గాల‌న్నారు. ప్ర‌భుత్వం మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించ‌డంతో పాటు అత్యాధునిక వైద్య ప‌రిక‌రాలు, మందుల‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు నిధులు కేటాయించేందుకు వెనుకాడ‌టం లేద‌ని.. ఈ విష‌యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి కోరిన వెంట‌నే స‌హ‌కార‌మందించేందుకు సిద్ధంగా ఉన్నార‌న్నారు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల సేవ‌ల‌పై న‌మ్మ‌కాన్ని క‌లిగించిన‌ట్ల‌యితే ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు.
మ‌రిత నాణ్యమైన సేవ‌లందించాలి: ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్‌
శాస‌న‌స‌భ్యులు గ‌ద్దె రామ్మోహ‌న్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద ఆసుప‌త్రుల్లో ఒక‌టైన విజ‌య‌వాడ స‌ర్వ‌జనాసుప‌త్రిలో పూర్తిస్థాయిలో మౌలిక వ‌స‌తులు క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. మౌలిక వ‌స‌తుల అభివృద్ధితో పాటు రోగుల‌కు మ‌రింత నాణ్య‌మైన సేవ‌లందించ‌డంలో అధికారులు, సిబ్బంది అంకిత‌భావంతో ప‌నిచేయాల‌ని కోరారు. పారిశుద్ధ్యంపై ప్ర‌త్యేక దృష్టిపెట్టాల‌ని, ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లకు తావులేకుండా ఆద‌ర్శ‌వంతమైన ఆసుప‌త్రిగా జీజీహెచ్‌ను తీర్చిదిద్దేందుకు స‌మ‌ష్టిగా కృషిచేయాల‌ని సూచించారు.
పేద రోగులకు నాణ్య‌మైన వైద్య సేవ‌ల‌పై ప్ర‌భుత్వం దృష్టి: ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు
శాస‌న‌స‌భ్యులు బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం స్వ‌ర్ణాంధ్ర విజ‌న్ @ 2047 దార్శ‌నికత ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు పేద రోగుల‌కు నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందించ‌డంపై ప్ర‌త్యేకంగా దృష్టిసారిస్తోంద‌ని.. దీనికి అనుగుణంగా ఆసుప‌త్రి వైద్యులు, సిబ్బంది సేవ‌లందించాల‌ని సూచించారు. అనారోగ్యంతో జీజీహెచ్‌కు వెళితే నాణ్య‌మైన వైద్య సేవ‌లు పొంది, ఆరోగ్యవంతంగా ఇంటికి తిరిగివెళ్లొచ్చనే భ‌రోసా క‌ల్పించేలా సేవ‌లందించాల‌ని సూచించారు.
మౌలిక వ‌స‌తుల ప్ర‌తిపాద‌న‌ల‌కు ఆమోదం: ప‌ల్మ‌న‌రీ మెడిసిన్ డిపార్టుమెంటుకు రూ. 5,17,000తో, గైన‌కాల‌జీ డిపార్టుమెంటుకు రూ. 4,50,000తో, మైక్రోబ‌యాల‌జీ డిపార్టుమెంటుకు రూ. 10,90,000తో ఈఎన్‌టీ డిపార్టుమెంటుకు రూ. 3 ల‌క్ష‌ల‌తో, డీవీఎల్ డిపార్టుమెంటుకు రూ. 2,82,400తో, ఎమ‌ర్జెన్సీ మెడిసిన్ డిపార్టుమెంటుకు రూ. 3,74,000తో వివిధ సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు క‌మిటీ ఆమోదం తెలిపింది. అదేవిధంగా పాత‌, కొత్త జీజీహెచ్‌ల‌తో పాటు పీఎంఎస్ఎస్‌వై బ్లాక్‌లో రూ. 4,50,000తో ప‌బ్లిక్ అడ్రెసింగ్ సిస్ట‌మ్ ఏర్పాటుకు కూడా క‌మిటీ ఆమోదం తెలిపింది. ఓపీ కౌంట‌ర్ల క్యూబిక‌ల్స్ కోసం రూ. ల‌క్ష‌తో ప‌నులు చేపట్టేందుకు, ఆర్థోపెడిక్ డిపార్టుమెంట్‌లో దాదాపు మూడు ల‌క్ష‌ల‌తో అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు కూడా ఆమోదం తెలిపారు.
స‌మావేశంలో అడిష‌న‌ల్ డీఎంఈ డా. వెంక‌టేష్‌, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డా. వెంక‌టేశ్వ‌ర‌రావు, మెడిక‌ల్ కాలేజీ ప్రిన్సిప‌ల్ డా. పి.అశోక్ కుమార్, ఆర్ఎంవోలు డా. ప‌ద్మావ‌తి, డా. మంగాదేవి, డా. శ్రీనివాస్‌, డా. నాగార్జున, వివిధ విభాగాల అధిప‌తులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here