*న్యూఢిల్లీ/అమరావతి*
ప్రధాని మోదీ, అశ్వినీ వైష్ణవ్తో సీఎం చంద్రబాబు భేటీ
బుడమేరు వరదలపై నివేదిక ఇచ్చాక తొలిసారి ప్రధానిని కలిసిన సీఎం
రైల్వే జోన్ సహా ఇతర అంశాలపై చర్చ
ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన కీలక అంశాలపై దాదాపు గంటపాటు ఆయన ప్రధానికి వివరించారు. ఇటీవల భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేయగా, బుడమేరు పొంగి విజయవాడను ముంచెత్తింది. బుడమేరు వరదలపై నివేదిక ఇచ్చిన తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అయిన సీఎం చంద్రబాబు వరదలకు నష్టపోయిన రాష్ట్రానికి మరిన్ని నిధులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పనులు తిరిగి ప్రారంభించాలని, మరో సీజన్ నష్టపోకుండా నవంబర్లో వరద తగ్గుముఖం పట్టగానే కొత్త డయాఫ్రంవాల్ నిర్మాణ పనులు ప్రారంభించి వేసవి కల్లా పూర్తిచేసేలా సహకరించాలని చంద్రబాబు ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ని కలవడంపై సీఎం చంద్రబాబు ‘ఎక్స్’లో స్పందించారు. ప్రధాని మోదీతో ఫలవంతంగా చర్చలు జరిగాయని తెలిపారు. పోలవరం రివైజ్డ్ వ్యయ అంచనాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రధానికి వివరించానన్న సీఎం, ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొనే విషయాల్లో కేంద్ర మద్దతు ఉందన్నారు. అమరావతికి ప్రధాని మద్దతును అభినందిస్తున్నానని సీఎం పేర్కొన్నారు.
ప్రధానితో సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబు తన అధికార నివాసానికి వెళ్లిపోయారు. అక్కడ రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో చంద్రబాబు భేటీ అయ్యారు. కేంద్ర ప్రాజెక్టులకు పెండింగ్ నిధులు మంజూరుతోపాటు విశాఖ రైల్వే జోన్ పురోగతిపైనా కేంద్రమంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. అమరావతికి అనుసంధానమయ్యే రైల్వే ప్రాజెక్టుల గురించి, రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధి, అనుసంధానంపైనా కేంద్రమంత్రితో భేటీలో చంద్రబాబు వివరించినట్లు సమాచారం.
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలవడంపై కూడా ‘ఎక్స్’లో సీఎం చంద్రబాబు స్పందించారు. డిసెంబరు నాటికి విశాఖ రైల్వే జోన్కు శంకుస్థాపన చేసే అవకాశం ఉందన్నారు. విశాఖ రైల్వే జోన్ హామీ నెరవేర్చిన రైల్వే మంత్రికి ధన్యవాదాలు చెప్పానని తెలిపారు. ఏపీలోని మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడతామని చెప్పారన్నారు. ఏపీలో రైల్వే రూ.73,743 కోట్లు పెట్టుబడి పెడుతుందని మంత్రి చెప్పారని, హౌరా-చెన్నై మధ్య 4-లేనింగ్, 73 స్టేషన్ల ఆధునికీకరణ జరుగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో మరిన్ని లోకల్ రైళ్లు ప్రవేశపెట్టవచ్చని, ఏపీలో లాజిస్టిక్, కమ్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలోపేతం చేస్తున్నట్లు, ఈ దిశగా రైల్వేతో భాగస్వామ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోందని ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
మంగళవారం కూడా పలువురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాత్రికి దిల్లీలోనే బస చేయనున్న చంద్రబాబు, మంగళవారం ఉదయం ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలుస్తారు. అమరావతి ORR సహా జాతీయ రహదారుల అభివృద్ధికి నిధుల గురించి మాట్లాడతారు. ఉదయం 11.30 గంటలకు కేంద్రమంత్రి గడ్కరీతో సమావేశం అయ్యాక, సాయంత్రం పీయూష్ గోయల్, హర్దీప్సింగ్ పురిని కలవనున్నారు. మంగళవారం రాత్రి 8 గంటలకు హోంమంత్రి అమిత్షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం రాత్రి 11 గంటలకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తోనూ చంద్రబాబు సమావేశం కానున్నారు.