దుర్గమ్మ ఆశీస్సులతో అమరావతి పునర్ నిర్మాణ పనులు విజయవంతం కావాలి
ప్రధాని మోదీ అమరావతి పర్యటన భావితరాలకు భవిష్యత్తు కావాలి
.
ఎన్డీఎ కూటమి ప్రభుత్వ హయాంలో అమరావతి.. పోలవరం పూర్తి కావాలి
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ
1:
విజయవాడ, మే 1 : విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో అమరావతి పునః నిర్మాణ పనులు విజయవంతం కావాలని, అమరావతి పునః ప్రారంభ పనులకు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేయనున్నారని, ఏపీలో ప్రధాని మోదీ పర్యటన విజయవంతం కావాలని దివంగత సీఎం, టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) తనయుడు రామకృష్ణ ఆకాంక్షించారు. అమరావతి పున: ప్రారంభ పనుల శంకుస్థాపనలో పాల్గొనేందుకు గురువారం విజయవాడ వచ్చిన రామకృష్ణ రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తితో కలిసి విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకస్వాములు రామకృష్ణకు అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేదాశీర్వచనం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలను అందించి అమ్మవారి శేషవస్త్రాలతో రామకృష్ణను సత్కరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజారాజధారి అమరావతి పునఃనిర్మాణ పనులకు మోదీ శుక్రవారం అమరావతికి వస్తున్నారని, ఆయన పర్యటన విజయంతం కావాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. ఎన్డీఎ కూటమి ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణం పూర్తి కావాలని, ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని, తద్వారా ఏపీ అన్నపూర్ణగా రూపుదిద్దుకోవాలని, సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. తెలుగుదేశం పార్టీ, తమ తండ్రి ఎన్టీఆర్ ఆశయాల సాధనకు సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని, ఆయన నాయకత్వంలో ఏపీ అన్నివిధాలా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. స్వర్ణాంధ్రగా ఏపీ రూపుద్దికోవాలని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కలలు సాకారం కావాలని, ప్రజాశీస్సులతో స్వర్ణాంధ్ర-2047 ద్వారా లక్ష్యాన్ని సాధించాలని రామకృష్ణ ఆకాంక్షించారు. కార్యక్రమంలో రామకృష్ణ వెంట రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, వీరమాచనేని శివప్రసాద్ వల్లూరు కిరణ్ తదితరులు ఉన్నారు.