మచిలీపట్నం మే 31
ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
శనివారం ఉదయం రాష్ట్ర మంత్రివర్యులు నగరంలోని వారి కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
మంత్రి ప్రజల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు.
అనంతరం మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.
ప్రతి శుక్రవారం శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా సమస్యలు తీర్చాలని సూచించారన్నారు.
ఇందులో భాగంగానే శనివారం ప్రజా దర్బార్ నిర్వహించామని ఇప్పటిదాకా 100 అర్జీలు వచ్చాయని వాటన్నిటిని పరిష్కరించాలని కోరుతూ సంబంధిత అధికారులకు వాటిని పంపిస్తున్నామన్నారు.
ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తున్నామన్నారు.
అర్జీలలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రధాన సమస్యలైన రెవెన్యూ, భూమి,ఇళ్ల స్థలాలు, డ్రైనేజీ, గుంతల రహదారులు వంటి ప్రధాన సమస్యలు ఉన్నాయన్నారు.
వచ్చే జూన్ నెల 12 వ తేదీన కొత్తగా 95 వేల మందికి పింఛన్లు ఇవ్వబోతున్నామన్నారు.
రేషన్ కార్డులు కూడా సరిచేసి కొత్తవి ఇవ్వడం జరుగుతుందన్నారు
నిత్యావసర సరుకులు ఎండీయూ వాహనాల ద్వారా సరిగా పంపిణీ కాకపోవడంతో వాటిని నిలుపుదల చేసి వచ్చే జూన్ నెల 1 వ తేదీ నుండి పూర్వ పద్ధతిలోనే చౌక దుకాణాల ద్వారా ఆ సరుకులను పంపిణీ చేస్తున్నామన్నారు.
ప్రజలు వారికి వీలైన సమయంలో చౌక దుకాణాలకు వెళ్లి కావలసిన సరుకులు తెచ్చుకునే సౌలభ్యం ఉందన్నారు.
పేదలకు కళ్ళు దెబ్బ తినకుండా ఉండాలనే ఉద్దేశంతో తొలిదశలో దీపం-1 పథకం కింద కోటి గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయడం జరిగిందన్నారు.
దీపం 2 పథకం కింద ప్రస్తుతం ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామన్నారు.
వచ్చే జూన్ మాసంలో పాఠశాలలు తెరిచే సమయానికి తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల చదువు కోసం 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు.
అలాగే పట్టెడన్నం పెడుతున్న రైతన్నలను ఆదుకోవాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6000 రూపాయలకు మరో 14 వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జోడించి మొత్తం 20 వేల రూపాయలను అన్నదాత సుఖీభవ పథకం కింద 3 విడతల్లో ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు.
ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం కింద 78 వేల రూపాయల వరకు రాయితీ ఉంటుందని, ఎస్సీలు ఎస్టీలకు ఉచితంగా, బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం మరో 20000 రూపాయలు కలిపి మొత్తం 98 వేల రూపాయలు రాయితీ ఇస్తుందన్నారు.
నియోజకవర్గానికి 10,000 కనెక్షన్లు ఇస్తున్నామని ఇంకా అవసరమైతే అదనంగా కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మిగులు విద్యుత్ ఉత్పత్తి అయితే గ్రిడ్డుకు వెళ్తుందని తద్వారా వినియోగదారులకు అదనపు ఆదాయం కూడా వస్తుందన్నారు.
ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు కింద పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని నియోజకవర్గంలో 1.90 కోట్ల రూపాయలు పరిహారం మంజూరు అయిందన్నారు
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలందరూ సహకారం అందించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేవరపల్లి అనిత, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే దుర్గ ప్రసాద్ , స్థానిక ప్రముఖ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, మోటమర్రి బాబా ప్రసాద్, ఎల్ వెంకటస్వామి బచ్చుల అనిల్ కుమార్ తదితర అనధికారులు పాల్గొన్నారు.