ప్రజల నమ్మకాన్ని నిలుపుకొన్నాం
ఐదేళ్ల చీకటి పాలన నుంచి వెలుగు వైపు అడుగులు వేస్తున్నాం
* విశాఖపట్నం బహిరంగ సభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
విశాఖపట్నం:- అభివృద్ధికి ఆస్కారమే లేని ఆంధ్రప్రదేశ్ నుంచి.. అభివృద్ధి పుష్కలమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి మేమంతా కష్టపడి పని చేస్తున్నాం. గత ఐదేళ్ల చీకటి రోజుల నుంచి, అరాచక పాలన నుంచి మళ్లీ వెలుగు రేఖలు రాష్ట్రంలో పూయించడానికి అడుగులు వేస్తున్నాం. దీనిలో భాగమే రాష్ట్రానికి ఒకేసారి రూ. 2.10 లక్షల కోట్ల పెట్టుబడులు, సుమారు ఏడున్నర లక్షల మందికి ఉపాధి కల్పించే మార్గాలను ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో తీసుకొచ్చాం. ఈ నిరంతర అభివృద్ధి యజ్ఞం కొనసాగాలి. ఎన్డీఏ కూటమిపై ప్రజలంతా ఉంచిన నమ్మకాన్ని నిలుపుకొంటూ వారికి మరింత అండగా నిలుస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆశేష జనవాహినిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మారు. నిలబడ్డారు. అలా నిలబడినందుకు ప్రధాన మంత్రి మోదీ సారధ్యంలో ఈ రోజున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగుతున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్, ఆరు కొత్త రైల్వే ప్రాజెక్టులు మొత్తం కలిపి రాష్ట్రానికి రూ. 2 లక్షల పది వేల కోట్ల పెట్టుబడులు, ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అవినీతితో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లేక రాష్ట్రం విలవిల్లాడుతున్న సమయంలో ప్రజలు కూటమికి అండగా నిలబడ్డారు. అందుకే ఈ రోజున రూ. రెండు లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులతో ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఇవి కాకుండా కొత్త హైవేల నిర్మాణం, విస్తరణ, రాజధాని అమరావతికి పెట్టుబడులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి ఇచ్చారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ 24 గంటలు తాగునీరు ఇవ్వాలన్న తపన గౌరవ ప్రధాన మంత్రి గారిది. ప్రజలు మా మీద పెట్టిన భరోసా.. నమ్మకం.. ప్రధాన మంత్రి గారిపై చూపిన నమ్మకం నేడు రూ. రెండు లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులుగా ఇక్కడికి వచ్చాయి. 70 ఏళ్ల పాలనలో మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఆ గ్రామాలకు ప్రధాన మంత్రి సడక్ యోజన పథకం కింద ఈ రోజున రోడ్లు వేయగలుగుతున్నామంటే దానికి ప్రధాని ముందుండి వెన్నుతట్టి నిధులు సమకూరుస్తుండడమే కారణం. భారత దేశంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి ఆయన ఆశయం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర ఏ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడకూడదు. అభివృద్ధిలో అందరికీ సమాన వాటా ఉండాలన్న ఆయన సంకల్పమే ఈ రోజు ఈ పెట్టుబడులు. మోదీ సంకల్పానికి, సహకారానికి ఆయన మార్గదర్శకత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్నతలు.