జూన్ 23, 2024
ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవడం ప్రభుత్వం బాధ్యత
ఈ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం.
తక్షణ కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం.
డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం
వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం.
కాచి వడపోసిన నీటిని తాగాలని సూచిస్తున్నాం
రాష్ట్ర వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్
రాష్ట్ర వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ ఆదివారం స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, మాజీ మంత్రివర్యులు నెట్టెం రఘురాం, రాష్ట్ర వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కమిషనర్ డా. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి.సంపత్ కుమార్, ఇతర అధికారులతో కలిసి జగ్గయ్యపేట ప్రాంతంలో పర్యటించారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులకు భరోసా కల్పించారు. తాగునీటి సరఫరా వ్యవస్థలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ
ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవడం ప్రజాప్రభుత్వం బాధ్యత. అందుకే ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం అప్రమత్తంగా ఉన్నాం. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం.
– గౌరవ ఉప ముఖ్యమంత్రి డయేరియాపై ఇప్పటికే విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. తక్షణ కార్యాచరణకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. దీర్ఘకాలిక ప్రణాళికపైనా దృష్టిసారించడం జరుగుతోంది.
– వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 23 గ్రామాల్లో 168 డయేరియా కేసులు నమోదయ్యాయి. కాకినాడ, గుంటూరుతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటలో కేసులు నమోదయ్యాయి.
– జగ్గయ్యపేటలో ఇప్పటివరకు 58 కేసులు నమోదయ్యాయి. 14 మంది డిశ్చార్జ్ కాగా మిగిలిన వారికి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
– డయేరియా బాధితులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించడం జరుగుతోంది. ప్రధానంగా కేసుల నమోదుకు కలుషిత నీరు కారణంగా కనిపిస్తోంది. డిస్ట్రిబ్యూటరీ ఛానళ్లు శుభ్రం చేయకపోవడం, పైపులైన్ల లీకేజీలు వల్ల డ్రెయినేజీ వాటర్ కలవడం, 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు వల్ల సరిగా పనులు జరక్కపోవడం తదితరాల వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. ఏళ్లుగా సరైన నిర్వహణం లేకపోవడం ప్రభావం ఈ రూపంలో కనిపిస్తోంది.
– ఏఎన్ఎం, ఆశాలతో డయేరియాపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు వ్యక్తిగతంగా, పరిసరాల పరిశుభ్రత పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాం. ప్రజలు బాగా మరిగించి వడపోసిన నీటిని తాగాలి.
– ప్రతి బుధవారం నీటి వనరుల వద్ద బయలాజికల్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. 30 వేలకుపైగా నీటి వనరుల వద్ద నమూనాలను పరీక్షించగా 217 వనరులకు సంబంధించి కొద్దిమేర కలుషితం అయినట్లు గుర్తించాం.
– ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రాథమిక విధి. ఈ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కలిసి పనిచేస్తున్నాం. అప్రమత్తంగా ఉంటూ సరైన పర్యవేక్షణ, ప్రణాళికతో ముందడుగు వేస్తున్నాం.