16-08-2024
పేద ప్రజలకు పట్టెడన్నం పెట్టాలనే లక్ష్యంతోనే అన్న క్యాంటీన్లు ఏర్పాటు : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
అయోధ్యనగర్ లో అన్న క్యాంటీన్ ప్రారంభం
విజయవాడ : రాష్ట్రంలో పేద ప్రజలెవ్వరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయటం జరిగిందని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం లోని అయోధ్యనగర్ లో ఏర్పాటు చేసిన అన్నక్యాంటీన్ ను శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తో కలిసి ఎంపి కేశినేని శివనాథ్ ప్రారంభించారు. అనంతరం పేద ప్రజలకు అల్పాహారాన్నిఅందజేశారు.
ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పేద ప్రజలకు మళ్లీ అన్న క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకువచ్చినందుకు సీఎం చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. అన్న క్యాంటీన్లు ప్రారంభం కావటంతో పేద ప్రజలు పండుగ చేసుకుంటున్నారన్నారు. రోజుకి రూ.15 ఖర్చు చేస్తే మూడు పూటల కడుపు నిండా భోజనం ఇక్కడ లభిస్తుందని చెప్పారు. కార్మికులు, శ్రామికులకు ఈ అన్న క్యాంటీన్లు ఎంతోగానో ఉపయోగపడతాయన్నారు. తన కక్షపూరిత ఆలోచనతో పేద ప్రజలకు గత ఐదేళ్లుగా అన్న క్యాంటీన్లు లేకుండా చేసిన నీచుడు జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు.
అనంతరం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పేద ప్రజలు ఆకలితో బాధపడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఇక పై వుండదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు సెప్టెంబర్ నాటికి 203 ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఇరువురు నేతలను 32వ డివిజన్ కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్ సన్మానించారు.