పేద ప్రజలకు పంపిణీ చేసే పి.డి.యస్. బియ్యం అక్రమ వ్యాపారమునకు ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి
– *వడ్డే శోభనాద్రిశ్వరరావు*విజయవాడ: రాష్ట్రములో ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలను అరికట్టి పి.డి.యస్. బియ్యం అక్రమ వ్యాపారమునకు తావులేకుండా ప్రభుత్వము సప్లై చేయు బియ్యమును పేదప్రజలు వాడుకునే పద్దతిని చేపట్టవలసినదిగా వడ్డే శోభనాద్రిశ్వరరావు కోరారు ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు రేషన్ దుకాణముల ద్వారా అందచేయుచున్న సుమారు 28 లక్షల టన్నుల బియ్యములో, సుమారు మూడింట రెండు వంతులు బియ్యమును వారు బ్రోకర్లకు సుమారు కేజి రూ.8-10 లు చొప్పున అమ్మటం. బ్రోకర్లు సదరు బియ్యమును కొన్ని రైస్ మిల్లులకు సుమారు కేజి రూ.18/- లు చొప్పున అమ్మడం. రైస్ మిల్లుల వారు సదరు బియ్యమును ప్రాసెస్ చేసి సుమారు కేజి రూ.33/- లు చొప్పున ప్రభుత్వమునకు లేక ఇతరులకు అమ్ముతూ వుండటం జరుగుతూ వుంది. కాకినాడ పోర్టు ద్వారా బియ్యము ఇతర దేశములకు ఎగుమతి అవుతూ వుంది. పేద ప్రజలు బజారులో 25 కేజీల సంచిని రూ.1,400/-ల నుండి రూ.1,600/-లు చొప్పున కొనుక్కుంటూ ఉండటం బహిరంగ సత్యమే. ప్రభుత్వము అందించు బియ్యమును పేద ప్రజలు వాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వము రైస్ మిల్లులకు 433 క్వింటాళ్ళ ధాన్యాన్ని ఇస్తే సార్టెక్స్ మిషనరి ఉపయోగించి 15%నకు లోపే నూకలు వుండే 290 క్వింటాళ్ళ బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి ఇస్తున్నారు. అందుకొరకు ప్రభుత్వము మిల్లర్లకు క్వింటాలుకు రూ.120/- చొప్పున మిల్లింగ్ చార్జీలు ఇచ్చుచున్నది.ఇందుకు అదనముగా క్వింటాలుకు సుమారు రూ.125 ఇచ్చినచో మిల్లర్లు తమకు ప్రభుత్వము అందచేసిన ధాన్యమును ముందుగా (Steam Process చేసి, ఆరబెట్టి సార్టెక్స్ మిషనరీతో మిల్లింగ్ చేసి, అత్యంత నాణ్యమైన బియ్యమును అందించేందుకు వీలుకలుగుతుంది. ఈ బియ్యమును పేదలు వినియోగించుకుంటారు తప్ప అమ్మరు.ఇందువలన రాష్ట్ర ప్రభుత్వమునకు రూ.350 కోట్లు అదనముగా భారము పడినప్పటికి పేద ప్రజలకు సుమారు రూ.7,200 కోట్లు విలువైన బియ్యాన్ని మార్కెట్లో 23 కిలోలు రూ.1,400/-లు చొప్పున కొన్న భారము తొలుగుతుంది. సుమారు రూ.4,700 కోట్లు అక్రమ వ్యాపారానికి తెరపడుతుంది. స్టీమ్ ప్రాసెస్ చేయు రైస్ మిల్లులకు సమీపములోని పట్టణముల నుండి సాలిడ్ వేస్ట్ (చెత్త, వ్యర్ధాలు) బాయిలర్ లోనికి వాడేందుకు ఇస్తే పట్టణాలలో స్వచ్ఛతకు దోహదము జరుగుతుంది కావున ఈ విషయముపైన రైస్ మిల్లర్ల సంఘు, రైతు సంఘాలు, వినియోగదారుల సంఘాలతో, రాజకీయ పార్టీలతో చర్చించి సముచిత నిర్ణయము చేసినచో లక్షలాది పేద ప్రజలకు ప్రభుత్వము ఇచ్చు బియ్యమును తక్కువ ధరకు అమ్ముకొని అధిక ధరకు మార్కెట్లో బియ్యమును, కొనుగోలు చేసే దుర్వ్యవస్థ తగ్గుతుంది. ప్రభుత్వ బియ్యము అక్రమ వ్యాపారము అరికట్టబడుతుంది ప్రభుత్వం పరిశీలించి తగు చర్యలు తీసుకొనవలసినదిగా కోరారు.
![]()
