పార్టీ కోసం కష్టపడిన వారి ఇంటికి పెద్దకుమారుడిలా అండగా ఉంటా : లోకేశ్

పల్నాడు జిల్లా
రొంపిచర్ల
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమన్న మంత్రి లోకేశ్ ఇకపై వారిని నేరుగా కలుసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. కార్యకర్తల బాధ్యత తనదేని, పార్టీ కోసం కష్టపడిన వారి ఇంటికి పెద్దకుమారుడిలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో హత్యకు గురైన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబసభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకొని వారితో భేటీ అయ్యారు.
ఆర్థికంగా చాలా నష్టపోయామని, ఉపాధి హామీ, గృహనిర్మాణం బిల్లులు పెండింగ్లో ఉండటంతో పాటు, తాము నివసిస్తున్న ఇల్లు తాకట్టులో ఉందని మంత్రి దృష్టికి తెచ్చారు. ఆర్థికంగా ఆదుకుంటానని, బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వారి సమస్యల పరిష్కరిస్తానని చెప్పారు. హత్య పూర్వాపరాలు, వెన్నా నాగేంద్రమ్మ ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. నిందితులు స్వేచ్ఛగా సంచరిస్తున్నారని, వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని బాలకోటిరెడ్డి కుటుంబసభ్యులు లోకేశ్ను కోరారు. హత్య కేసు నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.