పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత చెట్లు పెంచని వారు స్వచ్ఛమైన గాలిని ఆశించడం సమంజసమా? ఏపీలో 2029 నాటికి 37 శాతం, 2047కి 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యం సీడ్ రాఖీతో ఆడబిడ్డలు పర్యావరణానికి దోహద పడాలి ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటవీ, పర్యావరణ శాఖ సలహాదారుగా ఆంధ్రా ఫారెస్ట్ మ్యాన్ అంకారావును నియమించిన సీఎం ఒక్క రోజులో కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం రాజధాని గ్రామం అనంతవరంలో ఏడీసీ పార్కులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కలిసి మొక్కలు నాటిన ముఖ్యమంత్రి అమరావతి, జూన్ 5: పర్యావరణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత కావాలి. స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. చెట్లను పెంచని వారు స్వచ్ఛమైన గాలిని ఆశించడం సమంజసమా? పర్యావరణాన్ని కాపాడటంలో దేశానికే ఆదర్శంగా ఏపీని తీర్చిదిద్దుతాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తుళ్లూరు మండలం అనంతవరంలో చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడీసీఎల్ పార్కులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కలిసి మొక్కలు నాటారు. సభా వేదిక వద్ద పర్యావరణ పరిరక్షణ నిమిత్తం కాలుష్య మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. *2047 నాటికి 50 శాతం పచ్చదనం*‘ఒక్కరోజే కోటి చెట్లను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎంతో ఆనందాన్నిస్తోంది. వచ్చే పర్యావరణ దినోత్సవం నాటికి రాష్ట్రంలో 5.58 కోట్ల మొక్కలు పెంచాలని సంకల్పించాం. రాష్ట్రంలో 37,421 చదరపు కిలోమీటర్ల పరిధిలో అడవులున్నాయి. రాష్ట్ర విస్తీర్ణంలో ఇది 23 శాతం. అటవీయేతర ప్రాంతంలోని పచ్చదనంతో కలిపి రాష్ట్రంలో 30.05 శాతం పచ్చదనముంది. దీన్ని 2047 నాటికి 50 శాతానికి తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నాం. పచ్చదనంలో మనం దేశానికే ఆదర్శంగా నిలవాలి. గత పాలకులు ఫోటోల కోసమే చెట్లు నాటేవారు. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ ప్రపంచానికి సవాల్ విసురుతోంది. వర్షాలు కురవడం తగ్గిపోయింది. భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. సాగు ప్రమాదంలో పడుతోంది. ఫ్లోరైడ్ పెరిగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి. *నా మనసుకు దగ్గరగా పర్యావరణ శాఖ* ‘గత ముఖ్యమంత్రి హెలికాఫ్టర్లో వస్తున్నాడంటే కింద రోడ్ల పక్కనున్న చెట్లు నరికేసేవారు. మేం పర్యటనలకు వస్తుంటే ఎక్కడైనా చెట్లు నరుకుతున్నారా? చెట్లు పెంచడం మన బాధ్యత… నరకడం దుర్మార్గం. కొన్ని దేశాల్లో చెట్లు నరికితే జైళ్లలో పెడతారు. ప్రభుత్వ అనుమతి లేకుండా చెట్లు నరక్కూడదు. వనజీవి రామయ్య నా దగ్గరకు ఎప్పుడు వచ్చినా మొక్క తెచ్చేవారు. ఆయన జీవితమంతా ఊరూరా తిరిగి మొక్కలు పెంపకంపై అవగాహన కల్పించారు. ఆయన మనందరికీ స్పూర్తి. నా చిన్నతనంలో మా గ్రామంలో కేశవ నాయుడు అనే సామాజిక కార్యకర్త కూడా అడవులు నరక్కుండా తీసుకున్న చర్యలు నాలో స్ఫూర్తి నింపాయి. అలాగే నా మనసుకు దగ్గరైన పర్యావరణ శాఖను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించడం సంతోషాన్నిస్తోంది. *‘సీడ్ రాఖీ’తో ఆడబిడ్డలు పర్యావరణానికి దోహద పడాలి*ప్లాస్టిక్ చాలా ప్రమాదకరం. ప్రకృతిని నాశనం చేస్తోంది. పశువులు ప్లాస్టిక్ తింటే.. వాటి పాలు మనం తాగుతున్నాం. కుళ్లిన చికెన్ను చేపలకు మేతగా వేస్తున్నారు. అందుకే పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా… స్వచ్చాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం. చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. గుంటూరు, విశాఖలో చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేసే ప్లాంట్లు ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వం దీనిపైన నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పట్ణణాల్లో 90 శాతం పొడి చెత్తను ఎనర్జీకి ఉపయోగిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో వేస్ట్ కంపోస్టు కేంద్రాలు నెలకొల్పాం. రీ సైక్లింగ్ కింద ఇప్పటికే 87 మున్సిపాలిటీల్లో 157 రెడ్యూస్, రీ యూజ్, రీ సైకిల్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి 17 కార్పొరేషన్లు, వచ్చే ఏడాది జూన్ 5 నాటికి మొత్తం రాష్ట్రాన్ని‘సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహితంగా మార్చుతాం. 175 నియోజకవర్గాల్లోనూ నగర వనాలు ఏర్పాటు చేస్తాం. మీ అన్నదమ్ముల నక్షత్రాలకు చెందిన మొక్కల విత్తనాలతో తయారుచేసిన సీడ్ రాఖీలను ఆడబిడ్డలంతా కట్టాలి.*సుందర నగరంగా అమరావతి*టీడీపీ, జనసేన, బీజేపీ ఏపీలో చరిత్ర సృష్టించి నిన్నటికి ఏడాది పూర్తయింది. విధ్వంసం నుంచి రాష్ట్ర పునర్నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నాం. వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ముందుకు వెళుతున్నాం. అమరావతి రాజధాని భవిష్యత్ తరాలకు దిక్సూచిగా మారుతుంది. దేవతల రాజధానిలో మనం ఉంటడం అదృష్టం. సుందర నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతాం. మియావాకీ తరహా గార్డెన్లు సహా అనేక దేశాల గార్డెన్లు అమరావతిలో పెంచుతాం. ఒకప్పుడు కరెంటు లేని స్థితి నుంచి… ఇప్పుడు మీ ఇంటి పైనుంచి కరెంటు ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకున్నాం. ఎస్సీ, ఎస్టీలకు 2 కిలోవాట్ల వరకు సోలార్ ప్యానెళ్లు ఉచితంగా అమరుస్తాం. గ్రీన్ ఎనర్జీలో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతాం. *సలహాదారుగా అంకారావు*ఈ నెల 21వ తేదీన ప్రధాని మోదీ ఆధ్వర్యంలో విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నాం. అక్కడ ఒకేరోజు 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది లక్ష కేంద్రాల్లో యోగా సాధన చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 25 లక్షల మందికి యోగా సర్టిఫికెట్లు అందజేస్తాం. యోగా మన జీవితంలో భాగం కావాలి. ఆయుష్ ద్వారా యోగాను ప్రతి ఒక్క ఇంటికి చేర్చేందుకు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా శిక్షణ ఇస్తున్నాం. నల్లమల అడువులను పరిరక్షిస్తున్న కొమెర అంకారావును అడవులు, పర్యావరణ శాఖ సలహాదారుగా నియమిస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.