ఎన్టీఆర్ జిల్లా, ఫిబ్రవరి 1, 2025
పటిష్ట పర్యవేక్షణతో సజావుగా పెన్షన్ల పంపిణీ
– పెన్షన్లు అందించే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని దృష్టిలో ఉంచుకొని పటిష్ట పర్యవేక్షణతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రక్రియను సజావుగా చేపట్డం జరిగిందని జిల్లా కలెక్టర్ డి. జి.లక్ష్మీశ అన్నారు.
ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ.. కంచికచర్ల మండలంలోని పరిటాల, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో పర్యటించారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్న ప్రక్రియను పరిశీలించారు. శనివారం ఉదయం 6 గంటలకు పంపిణీని ప్రారంభించి, మొదటిరోజే జిల్లాలో 2,29,913 పెన్షన్లకు రూ. 98.20 కోట్లు పంపిణీని పూర్తిచేసేందుకు కృషిచేయడం జరిగిందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అధికారుల పర్యవేక్షణతో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారులకు పెన్షన్లు అందించడం జరిగిందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. పెన్షన్ల పంపిణీని పరిశీలించిన అనంతరం పరిటాలలో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని (ఎస్డబ్ల్యూపీసీ) కలెక్టర్ పరిశీలించారు. ఈ కేంద్రం పూర్తిస్థాయిలో పనిచేసేలా, సామర్థ్యం మేరకు వర్మీ కంపోస్టును తయారుచేసేలా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ తీరును, డ్రెయిన్లను పరిశీలించి, సిబ్బందితో మాట్లాడారు. తడిచెత్త, పొడిచెత్తను విడివిడిగా సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. క్షేత్రస్థాయి పర్యటనలో కలెక్టర్ వెంట డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ, వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.