23-1-2025
నేతాజీ సేవలు మరువలేనివి
వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
దేశ స్వాతంత్ర్యం కోసం సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాట సేవలను ఎప్పటికి మరువలేమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని గురువారం 27వ డివిజన్ కొత్తవంతెన వద్ద ఆయన విగ్రహానికి వైసీపీ కార్పొరేటర్లు కొండాయిగుంట మల్లేశ్వరి, శర్వాణి మూర్తితో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆ మహనీయుని సేవలను స్మరించుకున్నారు. ఎనలేని ధైర్యసాహసాలకు, దేశభక్తికి నేతాజీ ప్రతీక అని కొనియాడారు. ఆయన నాయకత్వంలో లక్షలాది మంది ప్రజలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. దేశాన్ని దాస్యశృంఖలాలనుంచి విముక్తం చేసేందుకు.. ‘జైహింద్’ నినాదంతో యువతను ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ వైపు నడిపిన స్ఫూర్తి ప్రదాత సుభాష్ చంద్రబోస్ అని వ్యాఖ్యానించారు. ఆయన జీవితం దాదాపు అజ్ఞాతవాసం లాంటిదేనని, జీవితంలో ఎక్కువ భాగం ప్రవాసంలో గడిపారని తెలిపారు. దేశం కోసం తన సర్వస్వం త్యాగం చేశారని కీర్తించారు. అటువంటి అలుపెరుగని పోరాట యోధుడి జీవితాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని.. ముఖ్యంగా నేటి యువత నేతాజీని స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు కురిటి శివ, అంజి బాబు, దుర్గారావు, కాళ్ళ ఆదినారాయణ, కాళ్ళ శ్రీను, ప్రేమ్, కుమార్, మాత మహేష్, బంకా బాబీ, ఏపూరి మనోహర్, వీరవల్లి ఆచారి, రవివర్మ, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.