నెలలో కనీసం రెండు సార్లు ఆర్థిక కమిటీలు సమావేశం కావాలి
రాష్ట్ర శాసన సభా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అమరావతి, మార్చి 4: శాసన సభా ఆర్థిక కమిటీలు నెలలో కనీసం రెండు సార్లు సమావేశం కావాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. మంగళవారం రాష్ట్ర శాసన సభా భవనంలో శాసనసభ ప్రజాపద్ధుల కమిటీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ), శాసనసభ అంచనాల కమిటీ (ఎస్టిమేట్స్ కమిటీ) మరియు ప్రభుత్వ సంస్థల కమిటీ (పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ) ల ప్రాథమిక సమావేశం ఆయన అద్యక్షతన జరిగింది.
ఈ సందర్బంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ కమిటీలు ఏర్పాటు చేయడంలో ఇప్పటికే చాలా ఆలస్యమైంది అన్నారు. కమిటీ మెంబర్లు చాలా చురుగ్గా ఉండాలని, తద్వారా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ లో కానీ, అసెంబ్లీని నడిపించడం ఎంతో సులభౌమవుతుందన్నారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో బడ్జెట్ సమావేశాలు 60 రోజులు పాటు జరిగేవని, అవి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా జరిగేవన్నారు. అలాంటివి నేడు 15 రోజులకు తగ్గిందన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన అన్ని రాష్ట్రాల స్పీకర్ల సమావేశంలో పాల్గొన్నప్పుడు ఏ రాష్ట్రమైనా సరే అసెంబ్లీ సమావేశాలను సంవత్సరానికి కనీసం 60 రోజులపాటు జరపాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఇందుకు అన్ని రాష్ట్రాల సభాపతులు ఆమోదం తెలిపారన్నారు. కాబట్టి ఈ కమిటీలు నెలలో కనీసం రెండు సార్లు సమావేశాలు నిర్వహించుకోవాల న్నారు. ఏ ఉద్దేశంతో ఈ కమిటీలు ఏర్పాటు చేశారో ఆ లక్ష్యాల సాధనకు అనుగుణంగా సభ్యులందరూ సహకరించి సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి పబ్లిక్ ఆడిట్ జనరల్ వారి సలహాలు, సూచనలను కమిటీ సభ్యులు తప్పక పరిగణలోకి తీసుకోవాలన్నారు. తాము కూడా ఈ కమిటీలకు సంపూర్ణ సహకారాలను అందిస్తామన్నారు.
డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ ఈ మూడు కమిటీలు ఎంతో ముఖ్యమైనవని, సంబంధించిన చైర్మన్లు, సభ్యులందరూ అర్థవంతంగా చర్చల్లో పాల్గొనాలని అన్నారు. అలాగే క్షేత్ర స్థాయి పర్యటనలు కూడా చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కమిటీలు తరచూ సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కమిటీల సమావేశాలను మినీ అసెంబ్లీలుగా భావించి పాల్గొనాలన్నారు. ఈ సమావేశాలు శాసనసభ సమావేశాలు అంత ముఖ్యమైనవిగా భావించాలన్నారు. ఈ సమావేశాలను గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించి మంచి పేరును తీసుకురావాలన్నారు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ ఈ పదవి తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని, తనను చైర్మన్ గా నియమించినందుకు సభాపతికి ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు. పార్టీలకతీతంగా, పారదర్శకంగా, వివేకవంతంగా తమ కమిటీ పనిచేస్తుందన్నారు.
ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు మాట్లాడుతూ తనను చైర్మన్ గా నియమించినందుకు శాసనసభాపతికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తనకు అప్పగించిన కమిటీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ కూనా రవికుమార్ మాట్లాడుతూ ఈ కమిటీల ప్రారంభ సమావేశాన్ని ప్రారంభించాల్సిందిగా శాసనసభ స్పీకర్ను అభ్యర్థించినప్పుడు వారు అంగీకరించినందుకు, అలాగే ఈ కమిటీకి నన్ను అధ్యక్షునిగా నియమించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఎప్పటికప్పుడు కంట్రోల్ ఆడిటర్ జనరల్ వారు సూచనలు అనుసరించి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థలు ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయ లేదా అనే అంశాలను పరిశీలిస్తామన్నారు. అకౌంటెంట్ జనరల్ వారు పంపే సమాచారాన్ని పరిశీలించి ఆడిట్ పేరాలలోని లోటు పాట్లపై తరచూ సమావేశాన్ని నిర్వహించి, సభ్యుల సహకారంతో అన్ని అంశాలను పూర్తి చేస్తామని తెలిపారు.
అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్య దేవర, డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ తల్లూరి భాస్కర్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, శాసనసభ అంచనాల కమిటీ మరియు పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీల సభ్యులతో పాటు పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.