తేది: 10-03-2025
నాగార్జున సాగర్ ఎడమకాలువ 3వ జోన్ కు వెంటనే సాగర్ జలాలను తెలంగాణ నుంచి విడుదల చేయించాలి
ఆయకట్టులో సాగుచేసిన 2.36 లక్షల ఎకరాల ఆరుతడి పంటలను రక్షించాలి
అసెంబ్లీలో వెల్లడించిన గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం, నూజివీడు, తిరువూరు, మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో నాగార్జున సాగర్ ఎడమకాలువ 3వ జోన్ లో రైతులు ఈ సంవత్సరం 2.36 లక్షల ఎకరాల్లో పత్తి, మిర్చి, పొగాకు, జొన్న, మామిడి తదితర ఆరుతడి పంటలను సాగుచేయటం జరిగిందని, వీటిని రక్షించడానికి వెంటనే సాగర్ జలాలను తెలంగాణ నుంచి విడుదల చేయించాలని గన్నవరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం అసెంబ్లీ లో ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ ఎడమకాలువకు మొత్తం 32 టి.ఎం.సి లు విడుదల చెయ్యాల్సి ఉండగా ఇప్పటివరకూ పైన ఉన్న తెలంగాణ ప్రభుత్వం అరకొరగా 18 టి.ఎం.సి లు మాత్రమే విడుదల చేసిందని దీనివలన ఆరుతడి పంటలకు సక్రమంగా నీరు అందక రైతులు నానా ఇబ్బందులు పడుచున్నారని ఆయకట్టులోని మెట్ట ప్రాంతంలో, చెరువుల్లో నీరు లేకపోవడం వల్ల గ్రామాల్లో భూగర్భ జలాలు రోజు రోజుకూ అడుగంటిపోతున్నాయని ఈ ఆరుతడి పంటలను రక్షించడానికి 3వ జోన్ కు 2,000 క్యూసెక్కులు నిరాటకంగా ఏప్రిల్ 15 వరకు తెలంగాణ నుంచి సాగర్ జలాలను విడుదల చేయించి సాగుచేసిన ఆరుతడి పంటలను రక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ వాటా కింద 13 టి.ఎం.సి లు సాగర్ నీరు డ్యామ్ లో అందుబాటులో ఉన్నాయని గన్నవరం నియోజకవర్గంలో 3వ జోన్ లో బాపులపాడు, మాచవరం మేజర్ల కింద, కేసరపల్లి మైనర్ కింద బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం, విజయవాడ రూరల్ మండలాల్లో 30 వేల ఎకరాల ఆయకట్టులో ఈ ఆరుతడి పంటలు ఉన్నాయని తెలిపారు. ఈ దిగువ ప్రాంతంలో కొంత ఆయకట్టులో తన సొంత నిధులు కోటి రూపాయలు వెచ్చించి పోలవరం కుడికాలువ నుంచి మోటార్ల ద్వారా గోదావరి జలాలను అందించానని తెలిపారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాల్సి ఉండగా గత వైసీపీ ప్రభుత్వం మూర్కత్వంగా విశాఖపట్టణంలో ఏర్పాటు చెయ్యటానికి నిర్ణయించిందని మండిపడ్డారు. అవకాశం ఉంటే కె.ఆర్.ఎమ్.బి ప్రధాన కార్యాలయాన్ని రైల్ రోడ్డు విమాన కనెక్టివిటీ ఉండి, అమరావతిలో అంతర్భాగంగా ఉన్న గన్నవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.