
నవ్యాంధ్రకు నూతన శకం ఆరంభం సీఐఐతో శ్రీకారం
ఫలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంత్రి నారా లోకేష్ కృషి… భారీ పెట్టుబడులతో ప్రభుత్వం ఖుషి
రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
విశాఖ కేంద్రంగా వరాల వాన…ఐటీ సెక్టార్ కు కొత్త ఊపిరి
సీఐఐ సమ్మిట్ సక్సెస్ .. పెట్టుబడిదారులకు స్వర్గ ధామం ఆంధ్ర ప్రదేశ్
టెక్కలి, నవంబర్ 17: ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదికగా విజయవంతంగా పూర్తైన విశాఖ CII సమ్మిట్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభివర్ణించారు. నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి వర్యులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల హబ్గా మార్చాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు , మంత్రి నారా లోకేష్ చేపట్టిన వ్యూహాత్మక కృషికి ఈ సదస్సు ప్రత్యక్ష ఫలితమని తెలిపారు. గత ఐదేళ్లలో విధ్వంసకర విధానాలతో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ప్రధాన కంపెనీలు కూడా, కొత్త ప్రభుత్వంలోని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పద్ధతులకు ఆకర్షితులై తిరిగి ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. రెండు రోజుల్లోనే భారీ ఎత్తున పెట్టుబడులు రావడం, 613 ఒప్పందాల ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షలకుపైగా ఉద్యోగాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చాటుతున్నాయని అన్నారు. సదస్సు మొదలుకాకముందే రూ.3.65 లక్షల కోట్ల కొత్త పెట్టుబడులు రావడం, 35 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం రాష్ట్రంపై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. తొలి రోజు ఒక్కరోజే ₹8.26 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు నమోదవడం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి మళ్లీ ట్రాక్ పైకి వచ్చిందని అచ్చెన్నాయుడు గారు అన్నారు. పెట్టుబడులు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా—రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలలో సమానంగా విస్తరించేలా ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. పవర్, డ్రోన్స్, రీన్యూవబుల్ ఎనర్జీ, టెక్స్టైల్స్ రంగాల్లో రాయలసీమ వేగంగా ఎదుగుతుండగా, కోస్తాంధ్రలో క్వాంటం, ఆక్వా, పెట్రో, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, ఉత్తరాంధ్రలో డేటా టెక్, ఐటి, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాలలో ఘన అభివృద్ధి జరుగుతోందన్నారు. ప్రతి జిల్లాకు ప్రాధాన్యం, ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు—ఇవే నిజమైన వికేంద్రీకరణ లక్ష్యాలని మంత్రి స్పష్టం చేశారు. “సదస్సు విశాఖలో జరిగినా… పెట్టుబడులు మాత్రం యావత్ రాష్ట్రాన్ని కవర్ చేశాయి. ఈ పెట్టుబడుల సునామీతో ఆంధ్రప్రదేశ్ మళ్లీ భారతదేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలుస్తుంది,” అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
![]()
