నవరాత్రి ఉత్సవాలపై 88 శాతం పైగా భక్తుల సంతృప్తి: ఎంపి కేశినేని శివనాథ్.
హోం మంత్రిత్వ అనితతో కలిసి క్యూ లైన్లలోని భక్తులతో మాట్లాడిన ఎంపి కేశినేని శివనాథ్.
పాల కేంద్రంలో స్వయంగా పాలు కాచి భక్తులకు అందజేసిన ఎంపీ.
మూల నక్షత్రం సందర్భంగా విఐపి పాసులు రద్దు సాధారణ భక్తులకే ప్రాధాన్యం: ఎంపీ.
సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసిన మహిళలు, వృద్ధులు, యువత.
ముందస్తు ఏర్పాట్లతో దసరా పండుగ రద్దీ నియంత్రణకు ఎంపి సూచనలు.
విజయవాడ, సెప్టెంబర్ 29:
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లపై 88 శాతానికి పైగా భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. మూలా నక్షత్రం సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై చేసిన ఏర్పాట్లను హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఎంపి కేశినేని శివనాథ్ సోమవారం ఉదయం పరిశీలించారు. క్యూలైన్లో గల భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
భక్తులకు పంపిణీ చేస్తున్న పాల కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ కేశినేని శివనాథ్ స్వయంగా పాలు కాచి భక్తులకు అందజేశారు. ఏర్పాట్లు, దర్శన సమయాలపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులకు ఎంపి కేశినేని శివనాథ్, హోమ్ మంత్రి అనిత ధన్యవాదాలు తెలిపారు. మూల నక్షత్రం రోజున రద్దీని దృష్టిలో ఉంచుకొని సాధారణ భక్తులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో విఐపి పాస్లను రద్దు చేసినట్లు ఎంపి వివరించారు.
శరన్నవరాత్రుల్లో అత్యంత విశేషమైన మూల నక్షత్రం రోజున రద్దీ నియంత్రణకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మీడియా పాయింట్ వద్ద ఎంపి కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, భక్తులకు సౌకర్యాల పెంపు, క్యూ లైన్లో త్రాగునీరు, వైద్య సహాయం, పాలు పంపిణీ, వృద్ధులు-మహిళలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ఎంపీ తెలిపారు.. భవిష్యత్తులో మరింత మెరుగైన సౌకర్యాల కల్పన కోసం భక్తుల సూచనలు సేకరించి వాటిని అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
శాంతి భద్రతల పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారని, భక్తుల సహకారంతోనే ఈ ఉత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇంద్రకీలాద్రిపై భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కొనసాగుతాయని, దసరా ఉత్సవాలు మరింత విజయవంతంగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీ కోరారు.
![]()
