*02.12.2024*
ధాన్యం కొనుగోళ్లల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలం
వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏర్పాట్లు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. కుందావారి కండ్రికలో కల్లాలు, రహదారులపై నిల్వ ఉంచిన ధాన్యాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులకు ప్రభుత్వం నుంచి సరైన భరోసా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం చెప్పేది ఒకటి.. క్షేత్రస్థాయిలో జరుగుతోంది మరోకటని మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాలన్నీ నిర్వీర్యం అయ్యాయని దుయ్యబట్టారు. ఓ వైపు ముమ్మరంగా వరికోతలు సాగుతూ కల్లాలపై ధాన్యం రాసులు, బస్తాలు పేరుకుపోతుంటే.. మరోవైపు వాతావరణం రైతులను కలవరపెడుతోందన్నారు. కష్టపడి పండించుకున్న పంట ఏమవుతుందోనంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారన్నారు. అలాగే ఈ ప్రాంత రైతులు 1061, 1262, 1318, 1224 రకాల వరిని సాగుచేయగా.. రైస్ మిల్లర్లు 1061 రకం తప్ప మిగతా వాటిని కొనుగోలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పడంతోనే రైతులు ఈ రకాలను పండించారని.. ఇప్పుడు కొనుగోలు చేయకపోవడం అన్నదాతలను ఇబ్బందులకు గురి చేయడం కాదా..? అని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. మంత్రులు మాత్రం వాట్సప్ లో సందేశాన్ని పంపితే చాలు ధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతుండటం హాస్యాస్పదమన్నారు. మరోవైపు ఆరుగాలం పండించిన పంట రోడ్లపై ఉంటే అధికారులు మాత్రం తేమ పేరుతో వంకలు చెబుతూ.. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. గత ప్రభుత్వంలో తేమ 26 నుంచి 30 శాతం ఉన్నా ధాన్యం కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ధాన్యాన్ని 17 నుంచి 22 శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని చెప్పడం దారుణమన్నారు. చివరకు తెలుగుదేశం ప్రజాప్రతినిధులే డీఆర్సీ సమావేశంలో రైతాంగ సమస్యలపై గళం విప్పుతున్న పరిస్థితి చూస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యం సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే సంచులు, రవాణా వాహనాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన వెంట యరగొర్ల శ్రీరాములు, దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పామర్తి వెంకయ్య, నల్లమోతు బుజ్జయ్య, చెన్ని శ్రీనివాసరావు, మున్నంగి శ్రీనివాసరెడ్డి, పిన్నిబోయిన సుబ్బారావు, కొండా పాపారావు, శేఖర్, నాని, రైతులు ఉన్నారు.