దేశ అభివృద్ధిలో సహకార సొసైటీల పాత్ర కీలకం
ఎమ్మెల్యే సుజనా చౌదరి
సహకార భారతి ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో బుధవారం బందర్ రోడ్ లోని మురళి ఫార్చ్యూన్ లో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో సహకార సొసైటీ ల భాగస్వామ్యం ఎంతో కీలకం అన్నారు. సహకార భారతి గురించి అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా రైతులు, చిన్న తరహ కుటీర పరిశ్రమల వాళ్లు తెలుసుకోవాలని అన్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు సహకార సొసైటీగా పనిచేసేవని వారి స్ఫూర్తితోనే సహకార సొసైటీలు అభివృద్ధి చెందాయి అన్నారు. పారిశ్రామికవేత్త ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఎన్నో లెక్కలు ఉంటాయన్నారు. రైతులు మాత్రమే ఎటువంటి లెక్కలు వేసుకోకుండా లాభనష్టాలతో సంబంధం లేకుండా నిస్వార్ధంగా వ్యవసాయం చేస్తారన్నారు. గతంలో మాదిరి కాకుండా రైతు వారి పంటలు అమ్ముకునేందుకు మార్కెటింగ్ అవకాశాలు అనేకం వచ్చాయని తెలిపారు . రైతులందరికీ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి కో-ఆపరేటివ్ సొసైటీల గురించి, సహకార బ్యాంకులు, మరియు ముద్ర లోన్లు , గురించి వివరించి రైతులందరికీ రుణాలు అందేలా అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ సతీష్ మరాతె,విశాఖ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు, నాబార్డ్ జనరల్ మేనేజర్ నారాయణవరం మధు మూర్తి, సహకార భారతి ఏపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, భూపేష్ రెడ్డి ,జానకి దేవి ,తదితరులు పాల్గొన్నారు