దేశంలో నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి సీఎం చంద్రబాబునాయుడు
పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పధకాల ద్వారా నీటిని విడుదల చేయడం ఒక రికార్డు జలవనరుల శాఖా మంత్రి డా. నిమ్మల రామానాయుడు
పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పధకాల ద్వారా గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు
ఏలూరు/పోలవరం, జులై, 3: దేశంలోనే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని రాష్ట్ర జిల్లా వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పధకం లోని 2, 4, 6 పంపుల ద్వారా గోదావరి జలాలను బుధవారం ఉదయం మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా యంత్రాల వద్ద మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కె. వెట్రి సెల్వి, ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు,ముప్పిడి వెంకటేశ్వరరావు, పత్సమట్ల ధర్మరాజు లతో కలిసి పూజలు చేశారు. అనంతరం నీరు విడుదల ప్రదేశంలో గోదారమ్మకు పూజలు చేసి, హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఏటా వేలాది టీఎంసీల గోదావరి వరద నీరు వృధాగా సముద్రంలోకి పోతుందని, పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేలోగా దానిలో కొంతమేరైనా సాగుకి, త్రాగునీటికి వినియోగించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014లో నదుల అనుసంధానం కార్యక్రమంలో భాగంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రణాళిక చేశారన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పధకం ద్వారా 2016, 17, 18 సంవత్సరాల లో ఏటా పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని, 40 వేల కోట్ల రూపాయల విలువైన పంటను రైతులు పండించి, సంపద సృష్టించారని ఇది ముఖ్యమంత్రి దూర దృష్టికి నిదర్శనమన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణ డెల్టాకి సాగు నీరు అందించడం ద్వారా ముందస్తు ఖరీఫ్ పంట వేసుకునేందుకు రైతులకు అవకాశం ఉంటుందన్నారు. కృష్ణా జలాలను అటు రాయలసీమకి వినియోగించడం జరుగుతుందన్నారు. 2014లో తమ ప్రభుత్వం గెలిచిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రైతుల కలలను నెరవేర్చందుకు, ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన తెలంగాణతోనే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపాలని కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు ఒత్తిడి తీసుకురావడంతో ప్రత్యేక ఆర్డినెన్సు ద్వారా ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం విలీనం చేసిందన్నారు. చంద్రబాబు చొరవ కారణంగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైనదని మంత్రి చెప్పారు. పట్టిసీమ ద్వారా 20 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాలోని సాగు, త్రాగునీటికీ వినియోగిస్తామన్నారు. పట్టిసీమ రాష్ట్రానికి బంగారుసీమ అని మంత్రి కొనియాడారు. తమ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్ట్ లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని , ప్రాధాన్యతాక్రమంలో రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. ఒకేరోజు పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పధకాల ద్వారా నీటిని విడుదల చేయడం ఒక రికార్డు అని మంత్రి చెప్పారు. పట్టిసీమ ఎత్తిపోతల పధకం ద్వారా 8 వేల క్యూసెక్కులు, తాడిపూడి ద్వారా 875 క్యూసెక్కులతో కృష్ణా డెల్టాలోని రైతులకు, పురుషోత్తపట్నం ద్వారా 3500 క్యూసెక్కులు, పుష్కర ఎత్తిపోతల పధకాలాల ద్వారా 1200 క్యూసెక్కులు నీటిని విడుదల చేసి ఏలేరు రిజర్వాయర్ లో నీటినిల్వలను పెంచి, ఉత్తరాంధ్రకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందిస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కూడా నీరు అందిస్తామన్నారు. 2014 డయాఫ్రమ్ వాల్ పూర్తికాకుండా నిర్మాణ ఏజెన్సీ, ఇంజనీరింగ్ అధికారులను మార్చవద్దని పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ, హైదరాబాద్ కు చెందిన ఐ ఐ టి నిపుణులు చెప్పినప్పటికీ గత ప్రభుత్వం నిర్మాణ ఏజెన్సీ ని మార్చి , ఇంజనీరింగ్
అధికారులను బదిలీ చేసి, చారిత్రాత్మిక తప్పిదం చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సమస్యలను తొందర్లోనే అధిగమించి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి చెప్పారు. నిర్వాసితుల సమస్యలను కూడా ప్రాధాన్యతా గుర్తించి పరిష్కరిస్తామని మంత్రి రామానాయుడు చెప్పారు.
పట్టిసీమ ఎత్తిపోతల పధకంలో నీటి విడుదల చేసిన అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు తాడిపూడి ఎత్తిపోతల పధకం వద్దకు వెళ్లి అక్కడ కూడా నీటిని విడుదల చేశారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి, ఐటిడిఏ పిఓ ఎం . సూర్యతేజ, శాసనసభ్యులు చిర్రి బాలరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, ఆర్డీఓ కె. అద్దయ్య , ఇరిగేషన్ శాఖ ఎస్ ఈ నరసింహమూర్తి, ఈఈ బి. ఏసుబాబు, డి ఈ పెద్దిరాజు, రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, తహసీల్దార్ జి.వి. ప్రసాద్, ఎంపిడిఓ జి. శ్రీనివాస్, సర్పంచ్ సబ్బవరపు శ్రీరామమూర్తి, ఎంపిటిసి సోమరోతు అనితాకుమారి, బొరగం శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
అనంతరం పోలవరం ప్రాజెక్ట్ సైట్ ఆఫీస్ సమావేశపు హాలులో అంతర్జాతీయ నిపుణుల బృందం సభ్యులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమై వివరాలను అడిగి తెలుసుకున్నారు.