దేవదేవుని అనుగ్రహంతోనే అన్నదానం లో భాగస్వామ్యం మండవ కుటుంబరావు ఆశయాన్ని కొనసాగిస్తాం విజయవాడ :లక్షలాది మంది భక్తులకు అన్న ప్రసాదం అందిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న సేవలలో సామాన్య భక్తులు పాలుపంచుకునేలా ఒక మంచి బృహత్కార్యక్రమాన్ని ప్రారంభించిన దివంగత మండవ కుటుంబరావు ఆశయాల కొనసాగింపే ప్రలక్ష్యంగా మండవ కుటుంబరావు మిత్రమండలి పనిచేస్తుందని మరడ నాగేంద్ర అన్నారు. కుటుంబరావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా బందరు రోడ్డులోని ఏ వన్ కన్వెన్షన్ సెంటర్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి పది టన్నుల కూరగాయలతో బయలుదేరిన వాహనానికి మిత్ర మండలి సభ్యులు గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదానం ప్రారంభించిన తొలి రోజుల్లో అన్నదానంలో అన్న ప్రసాదం స్వీకరించే భక్తులు వందల సంఖ్యలో ఉండేవారని, ఆ సంఖ్య ప్రస్తుతం లక్షల్లోకి చేరిందని తెలిపారు. కీర్తిశేషులు మండవ కుటుంబరావు ప్రారంభించిన ఈ అద్వితీయ కార్యక్రమం సుదీర్ఘకాలం పాటు కొనసాగించేందుకే మండవ కుటుంబరావు మిత్రమండలి గత రెండు సంవత్సరాలుగా టీటీడీకి కూరగాయలను అందజేస్తుందన్నారు. పదిమంది మేలు కోసం పనిచేసే ప్రతి ఒక్కరిపై భగవంతుడు అనుగ్రహం ఉంటుందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టేందుకు భగవత్సంకల్పం ఎంతో ముఖ్యమన్నారు. మిత్ర మండలి సభ్యులు మండవ శశి మాట్లాడుతూ రెండు దశాబ్దాల క్రితం మండవ కుటుంబరావు ప్రారంభించిన ఈ దైవకార్యానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరూ భగవంతుని ఆశీస్సులు పొందుతారన్నారు. మహామహిమాన్వితమైన దేవుని సన్నిధిలో లక్షలాది మందికి నిత్యాన్నదానం నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అందిస్తున్న సేవలలో రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని అభిలషించారు. భక్తులు స్వామివారి ప్రసాదాన్ని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామి వారే భక్తుల కోసం పంపినట్టుగా భావించే స్థలంలో ఆహారం స్వీకరించేందుకు ప్రతి భక్తుడు ఇష్టపడతారన్నారు. దివంగత ధార్మికవేత్త మండవ కుటుంబరావు 2004లో ప్రారంభించిన ఈ మహోజ్వల కార్యక్రమం ఆయన మరణానంతరం ఎంతోమంది సేవాతత్పరుల దాతృత్వంతో నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి ఉండే మత విశ్వాసాల ఆధారంగా వారి వారి విశ్వాసాల ప్రకారం భగవదనుగ్రహం పొందడం కోసం చేసే సేవలలో ఆహారం పంపిణీ చాలా ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. ఇటువంటి సేవలు అందించేందుకు ఆర్థిక శక్తి తో పాటు భగవంతుని అనుగ్రహం కూడా ఎంతో ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు ఎంతోమంది దాతలు తనతో కలిసి రావడం భగవదనుగ్రహమేనన్నారు. లక్షలాది మందికి ప్రతిరోజు ఆహారాన్ని అందించడం ఎంతో కష్టమైన సేవ అని పేర్కొన్నారు. భగవంతుని అనుగ్రహంతో, దాతల సహకారంతో రానున్న రోజుల్లో మరిన్ని ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. తొలుత మండవ కుటుంబరావు చిత్రపటానికి పూలమాలలు వేసి సభ్యులు నివాళులు అర్పించారు.కార్యక్రమంలో మిత్రమండలి సభ్యులు మేదరమెట్ల శ్రీనివాస్గుమ్మడి సురేష్,అరవపల్లి ఆదిత్య,శేష సాయి వర్మ,పైడిపాటి త్రినాథ్,మాజీ కార్పొరేటర్ గోగినేని సుజాత తదితరులతో సహాపలువురు ధార్మిక, ఆధ్యాత్మికవాదులు పాల్గొన్నారు.
