దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాల పంపిణీ
స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం
శ్రీ భగవాన్ మహావీర్ వికలాంగ సహాయత సమితి ఆధ్వర్యంలో ది చేంజ్ మేకర్, హాసి ఫౌండేషన్ సహకారంతో వన్ టౌన్ లోని సి.వి.రెడ్డి ఫౌండేషన్ ప్రాంగణంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం ఆదివారం విజయవంతంగా ముగిసింది.
ఈ శిబిరానికి పెద్ద ఎత్తున దివ్యాంగులు హాజరై సేవలు పొందారు.
పదిమంది సాంకేతిక నిపుణులతో ఈ శిబిరాన్ని కొనసాగించారు. దివ్యాంగుల కొలతలు తీసుకొని గంటల వ్యవధిలోనె వారికి తగిన అవయవాలు సిద్ధం చేసి ఇస్తున్నారు. కృత్రిమ అవయవాలతో పాటు వీల్ చైర్లు, సహాయ కర్రలు వంటి పరికరాలు ఉచితంగా అందజేశారు.
పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కార్పొరేటర్ మహాదేవు అప్పాజీరావు తో కలసి ఆదివారం ఈ శిబిరాన్ని పరిశీలించారు. దివ్యాంగులకు అందిస్తున్న సేవలు స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలను సెక్రటరీ ఇంద్ర చంద్ జైన్ ను అడిగి తెలుసుకున్నారు.
సమాజ సేవలో భాగస్వామ్యులైన థి చేంజ్ మేకర్, హసీ ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. సుజనా ఫౌండేషన్ తరపున తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు.
హైదరాబాద్ కేంద్రంగా గత 23 సంవత్సరాలుగా దివ్యాంగులకు సేవలందిస్తున్నామని శ్రీ భగవాన్ మహావీర్ వికలాంగ సహాయతా సమితి సెక్రటరీ ఇంద్ర చంద్ జైన్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని అన్ని పట్టణాలలో తమ సేవలను అందించామని ఇప్పటివరకు 80 వేల మంది దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలను పంపిణీ చేసామన్నారు.
మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఈ శిబిరంలో 210 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయాలను అందజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం స్పందించి
స్థలం కేటాయిస్తే విజయవాడ కేంద్రంగా తమ సంస్థ కార్యకలాపాలను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
స్వచ్ఛంద సంస్థల సభ్యులు ప్రదీప్ జైన్, ఆర్యన్, అనూజ్, అమిత్ ఈ శిబిరంలో తమ సేవలను అందించారు.