థాంక్యూ మోదీ జీ
- ₹3653 కోట్ల తో బద్వేల్-నెల్లూరు హైవేకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
- పట్నా విమానాశ్రయ ప్రారంభోత్సవ సందర్భంలో మోదీకి జాతీయ రహదారి మంజూరు పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు
- మహానాడులో ఆపరేషన్ సింధూర పై టీడీపీ తీసుకున్న రాజకీయ తీర్మానం పై ప్రధానికి సమాచారం అందజేత.
పాట్నా, మే 29 :
ఆంధ్రప్రదేశ్ మౌలిక వృద్ధికి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బద్వేల్ నుండి గురువిందపూడి వరకు 4 లేన్ల హైవే నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం ₹3653 కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు, రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి తోడ్పాటు అందించేలా జాతీయ రహదారిని నిర్మించనున్నారు .
కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, బుధవారం పాట్నాలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ఈ ఆమోదానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల గౌరవ ప్రధానమంత్రికి ఉన్న నిబద్ధతను ఈ నిర్ణయం స్పష్టంగా చూపిస్తోంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు మన రాష్ట్రానికి చేర్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు ఇది పెద్ద ఉదాహరణ’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ హైవే కారిడార్ NH-67 (బద్వేల్) నుండి NH-16 (గురువిందపూడి) వరకు 108 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. కృష్ణపట్నం పోర్ట్కు ప్రయాణ దూరాన్ని సగానికి తగ్గించే ఈ మార్గం, రాష్ట్రంలోని మూడు ప్రధాన పారిశ్రామిక కారిడార్లను కలుపుతుందని అధికారులు తెలిపారు. 43 లక్షల మానవ-దినాల ఉపాధిని ఈ ప్రాజెక్టు కలిగించనున్నట్లు అంచనా.
మహానాడు తీర్మానంపై ప్రధానికి నివేదిక :
మరోవైపు, మే 27న జరిగిన టిడిపి మహానాడు సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన రాజకీయ తీర్మానాన్ని కూడా మంత్రి రామ్మోహన్ ప్రధానమంత్రికి తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ తీర్మానం ద్వారా టిడిపి ‘ఆపరేషన్ సింధూర్’కు పూర్తి మద్దతును ప్రకటించింది.
“దేశాన్ని రక్షించే సైన్యం పట్ల మేము నిలబడతాం. ప్రధానమంత్రి మోదీ నాయకత్వాన్ని టిడిపి సంపూర్ణంగా మద్దతిస్తున్నది’’ అంటూ ఈ తీర్మానాన్ని మహానాడులో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి, మంగళవారం పాట్నాలో ప్రధానికి అధికారికంగా తెలియజేశారు.