19 – 03 – 2025
తెలంగాణ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ తో అబ్దుల్ అజీజ్ భేటీ.
తెలంగాణ నుంచి ఆంధ్ర కు రావాల్సిన 55 కోట్లను త్వరితగతిన బదిలీ చేయండి.
ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన పాత రికార్డులు అప్పగించండి.
త్వరలో ఇరు రాష్ట్రాల బోర్డ్ సభ్యులు కలిసి సమీక్షించి సమస్యను పరిష్కరిస్తాం.
– షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్.
హైదరాబాద్ లోని నాంపల్లి నందు గల తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని తో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన లో భాగంగా భారత ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2015లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరు వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ఉన్న డిపాజిట్లు, పెట్టుబడులు, మరియు నగదు నిల్వలను ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డుకు బదిలీ చేయాలని గెజిట్ లో స్పష్టంగా పేర్కొందని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన కోట్ల రూపాయల నిధులు, రాష్ట్రానికి సంబంధించిన పాత రికార్డులు ఇప్పటివరకు అప్పగించలేదని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని ఆంధ్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు రావాల్సిన రూ. 55,49,44,123/- త్వరితగతిన బదిలీ చేయాలని కోరారు. అలాగే ఫైళ్లూ, సర్వే పత్రాలూ, జిల్లాల వారీగా గెజెట్లూ, బోర్డు తీర్మానాల ప్రతులూ, పాత రికార్డులన్నీ తమకు అందచేయాలని కోరారు. దీని పై తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రంజాన్ పండుగ తర్వాత ఇరు రాష్ట్రాల వక్ఫ్ బోర్డ్ చైర్మన్ లు, బోర్డ్ సభ్యులు, అధికారులు కలిసి సమీక్షించి ప్రణాళిక రూపొందించి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఇరువురు చైర్మన్ లు నిర్ణయించారు.