04.10.2024.
తాడేపల్లి.
తిరుమల లడ్డూ వివాదంపై వాదనల అనంతరం.. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్య్ర సిట్ ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, మధ్యాహ్నం క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి.
శ్రీ వైయస్ జగన్ ప్రెస్మీట్. ముఖ్యాంశాలు:
– ఈరోజు కోర్టులో జరిగిన పరిణామాలను, అలాగే గత సోమవారం (సెప్టెంబరు 30) జరిగిన పరిణామాలను మీరంతా గమనించే ఉంటారు.
– రెండింటిలో కూడా మనం గమనించినట్లు అయితే, చంద్రబాబు నిజ స్వరూపాన్ని ఎత్తి చూపారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా రెచ్చగొడుతున్నాడనేది సుప్రీంకోర్టు గట్టి వ్యాఖ్యలు చేసింది.
– దేవుణ్ని రాజకీయాల్లోకి లాగొద్దు అంది. చంద్రబాబు స్వయంగా వేసుకున్న ‘సిట్’ను కూడా రద్దు చేశారు.
– తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేసి, లడ్డూలో జంతువుల కొవ్వు వాడినట్లు, దాన్ని భక్తులకు ఇచ్చినట్లు, భక్తులు ఆ ప్రసాదం స్వీకరించినట్లు చేసిన ప్రచారం దారుణం.
– దీనిపై కోర్టు మొట్టికాయ వేసింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బ తీస్తూ, చంద్రబాబు ఎలా అబద్ధాలు చెప్పాడనేది చూస్తే.. టీటీడీ ఈఓ.. చంద్రబాబు సీఎం అయ్యాక, తను నియమించుకున్న టీటీడీ ఈఓ చంద్రబాబు ప్రకటనలకు విరుద్ధంగా స్వయంగా ప్రకటనలు చేశాడు.
– చంద్రబాబు మామూలుగా మంచి వ్యక్తి అయితే, ఇంత ఆధారాలు కనిపిస్తుంటే, కొంతైనా సిగ్గు పడతాడు. తన మాటలకు వ్యతిరేకంగా ఇన్ని సాక్ష్యాధారాలు కనిపించినప్పుడు, దేవుడంటే భయం, భక్తి ఉన్న వారెవరైనా పశ్చాత్తాప పడతారు. ప్రజలకు క్షమాపణ చెబుతారు.
– చంద్రబాబుకు పశ్చాత్తాపం ఉండదు. దేవుడంటే భక్తి, భయం ఉండదు.
కానీ, చంద్రబాబు ప్రవర్తించే తీరు ఎలా ఉందంటే.. ఈరోజు నిజంగా టీడీపీ వెబ్సైట్ ఎలా ఉందని చూస్తే..
– చంద్రబాబుగారు పెట్టిన పోస్టింగ్ చూస్తే.. ఆయనలో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదు. దేవుడి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించినా కనీసం పశ్చాత్తాపం లేదు. ఆయన దుర్భుద్ధి చూస్తే.. ఆయన ఆ పోస్టింగ్లో ఏం రాశాడంటే.. అంటూ అది చదివి వినిపించారు.
‘ధర్మారెడ్డి నాకు బావ అంట. కరుణాకర్రెడ్డి నాకు మామ అంట. మనిషి అన్నాక కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి’.
– ఇంత దారుణంగా వక్రీకరణ చేయడమా?
– సుప్రీంకోర్టు నిజానికి చంద్రబాబుకు అక్షింతలు వేస్తే, దాన్ని ఆరోజు నేషనల్ మీడియా మొత్తం రాసింది.
అంటూ.. నాడు పత్రికలు ఏం రాశాయన్నది చదివి వినిపించారు.
– ప్రతి నేషనల్ ఛానల్, ప్రతి ఇంగ్లిష్ పేపర్, చంద్రబాబును తప్పు బట్టినా, ఆయన్ను సుప్రీంకోర్టు తిట్టినా, ఆక్షేపించినా, టీడీపీ సోషల్ మీడియాలో రాస్తున్నది చూస్తుంటే.. ఆయన ఎంత నీచానికి దిగాడన్నది తెలుస్తుంది.
– నిజానికి సుప్రీంకోర్టు చంద్రబాబున తిడితే, దాన్నీ వక్రీకరిస్తూ.. మా పాపం పండింది. వైవీ సుబ్బారెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం అని రాశారు.
– ఇంత దారుణంగా వక్రీకరిస్తూ, చంద్రబాబు దిగజారిపోయిన పరిస్థితి.
సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చేసిన తప్పులు, చెప్పిన అబద్ధాలను మరోసారి మీకు వివరిస్తాను.
అంటూ ఆ వివరాలు మరోసారి ప్రస్తావించారు.
– జూలై 6, జూలై 12న వచ్చిన నెయ్యి ట్యాంకర్లు.. నాణ్యత పరీక్ష తర్వాత వాటిని అనుమతించలేదు.
– అందుకు తిరుపతి, తిరుమలలో ఒక గొప్ప రొబొస్ట్ వ్యవస్థ ఉంది.
– 2014–19 మధ్య క్వాలిటీ లేని 14 నెయ్యి ట్యాంకర్లు వెనక్కు పంపగా, మా హయాంలో 2019–24 మధ్య 18 ట్యాంకర్లు వెనక్కు పంపడం జరిగింది.
– నెయ్యి, ఇతర సరుకుల సేకరణకు టీటీడీలో పక్కా వ్యవస్థ ఉంది. అన్నీ ఈ–టెండర్ల ద్వారా బిడ్లు నిర్వహిస్తారు. ఎల్–1కు 65 శాతం, ఆ తర్వాత బిడ్లో ఉన్న వారికి 35 శాతం ఇస్తారు.
– తిరుమలకు టెండర్ ప్రకారం సరఫరా చేసే నెయ్యి ట్యాంకర్లు.. తమతో ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకురావాలి.
– అలా సర్టిఫికెట్తో వచ్చినా, తిరుమలలో శాంపిల్ను మూడు టెస్టులు చేస్తారు.
– అలాగే జూలై 6, 12 తేదీల్లో వచ్చిన నెయ్యి పరీక్షలో ఫెయిల్ అయితే, వాటిని వెనక్కు పంపారు. మూడు టెస్టులు ఫెయిల్ ఆ ట్యాంకర్ల నెయ్యిని ఎన్డీడీబీకి పంపిస్తే, జూలై 23న రిపోర్ట్ వచ్చింది.
– అంటే జూలై 6, 12 తేదీల్లో వచ్చిన నెయ్యి ట్యాంకర్లు వెనక్కు పంపడమే కాకుండా, ఆ కంపెనీ వారికి నోటీసులు కూడా ఇచ్చారు.
ఈ సందర్భంగా నాటి ఈఓ ప్రెస్మీట్ వీడియో చూపారు.
– అలా నాణ్యత లేని నెయ్యి వాడలేదని ఈఓ స్పష్టంగా చెప్పినా, తన 100 రోజుల పాలనలో అన్ని రంగాల్లో ఫెయిల్ అయిన చంద్రబాబు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. సెప్టెంబరు 18న ఎన్డీఏ సమావేశంలో.. తిరుమల లడ్డూపై దారుణ ఆరోపణలు చేశారు.
అంటూ ఆ వీడియో కూడా చూపారు.
– జూలై 23న ఎన్డీడీబీ రిపోర్ట్ వస్తే, రెండు నెలల తర్వాత అన్ని తెలిసి ఉండి కూడా.. సెప్టెంబరు 18న ఆ విషయం ప్రస్తావిస్తూ.. శ్రీవారి లడ్డూ తయారు చేసే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని పచ్చి అబద్ధాలు చెప్పారు.
– ఆ వెంటనే రెండు రోజులకు, అంటే సెప్టెంబరు 20న మాట్లాడిన.. టీటీడీ ఈఓ.. నాణ్యతలేని నెయ్యి వాడలేదని స్పష్టం చేశారు. టెస్టుల్లో ఫెయిల్ అయిన ట్యాంకర్లు వెనక్కు పంపామని చెప్పారు.
– అయినా కూడా మళ్లీ సెప్టెంబరు 22న మాట్లాడిన చంద్రబాబు, ఏ మాత్రం భయం, భక్తి లేకుండా తాను అంతకు ముందు చెప్పిన పచ్చి అబద్ధాలను మరోసారి వల్లె వేశారు.
– తిరుమలకు వచ్చిన 4 ట్యాంకర్ల నెయ్యి వాడినట్లు చెప్పారు.
– అంటే రాజకీయ ప్రయోజనం కోసం, దేవుడంటే, భయం భక్తి లేకుండా పచ్చి అబద్ధాలు చెప్పారు.
– రాజకీయ దురుద్దేశంతో అబద్ధాలు ఆడి, తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాశస్త్యం, లడ్డూ విశిష్టతను అపవిత్రం చేస్తూ చంద్రబాబు అన్న మాటలపై మేము ప్రధానికి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖలు రాశాం.
– అంతే కాకుండా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశాం. దీంతో కోర్టులో న్యాయమూర్తులు ఎలా స్పందించారో ఒకసారి గుర్తు చేసుకొండి..
అంటూ.. గత సోమవారం సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా న్యాయమూర్తులు ఏమన్నారనేది.. చదివి వినిపించారు.
– అంతే కాకుండా ఆరోజు (గత నెల 30వ తేదీన) సుప్రీంకోర్టు ఇంకా ఏం చెప్పిందనేది ప్రస్తావిస్తూ.. ఆ జడ్జిమెంట్ కాపీని స్లైడ్లో చూపారు.
చంద్రబాబును ఆక్షేపిస్తూ, సుప్రీంకోర్టు స్వయంగా ఈ వ్యాఖ్యలు చేసిందని చెప్పారు.
– కల్తీ నెయ్యి వాడలేదని ఈఓ చెప్పినా, చంద్రబాబు అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడారు.
– సిట్ ఏర్పాటు చేసినా, ఇంకా కల్తీ నెయ్యిపై ప్రకటన ఎలా చేస్తారని, మీడియాతో మాట్లాడతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
– ఇన్ని రకాలుగా సుప్రీంకోర్టు ఆక్షేపించినా, మళ్లీ న్యాయస్థానం కల్తీ నెయ్యి వాడినట్లు ఈఓ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, చంద్రబాబు చేసిన తప్పును ఎత్తి చూపుతూ, ఆయన స్వయంగా ఏర్పాటు చేసుకున్న సిట్ను రద్దు చేస్తూ..
సీబీఐ డెరెక్టర్ పర్యవేక్షణలో ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర అధికారులతో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు.. అందరితో సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
– ఇంతగా సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించినా.. చంద్రబాబులో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు.
– ఆయనకు వ్యక్తిత్వం ఉంటే ముందు ప్రజలను క్షమాపణ కోరాలి. తర్వాత స్వామి వారిని వేడుకోవాలి.
– కానీ, అవేవీ చేయకుండా టీడీపీ ట్విటర్ లో ఏం రాశారో చూడండి అంటూ..
ఆ ట్వీట్స్ చదివి వినిపించారు.
‘ధర్మారెడ్డి మా బావ అంట. ఇది ఒక పెద్ద అబద్ధం. కరుణాకర్రెడ్డి మా మామ అంట. అది మరో పెద్ద అబద్ధం’.
– నిజానికి సుప్రీంకోర్టు ఎవరినీ తప్పు పట్టింది. ఎవరు దేవుడి దగ్గర దోషిగా నిలబడాలి. ఎవరికి దేవుడంటే భయం, భక్తి ఉంది.
– మన ఖర్మ ఏమిటంటే.. చంద్రబాబు వంటి అన్యాయమైన నాయకుడు మనకున్నాడు.
– రాబోయే రోజుల్లో దేవుడి కోపం రాష్ట్ర ప్రజలపై పడకూడదు. అది చంద్రబాబుకే పరిమితం కావాలి. ఆయన మాట్లాడింది పచ్చి అబద్ధం అని తెలిసినా ఆయన్ను మోస్తున్న కూటమికి, ఆ నాయకులకే దేవుడి కోపం పరిమితం కావాలని దేవుణ్ని వేడుకుంటున్నాను.
– చివరగా, ఒకటి గుర్తు పెట్టుకొండి. ఇవన్నీ వెలుగులోకి వచ్చాయంటే దేవుడి దయతోనే. అన్నీ వెంకటేశ్వరస్వామినే నడిపిస్తున్నాడు. ఆయనే వారికి మొట్టికాయలు వేస్తాడు.
– అసలు పవన్కు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా?
– సాక్షాత్తూ నువ్వు ఆ కూటమిలో ఉన్నావు. నీ కళ్ల ఎదుటే చంద్రబాబు ఆ తప్పు చేశాడు. అది నీతో సహా, ఆరేళ్ల పిల్లాడికి కూడా కనిపిస్తోంది.
– శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రాశస్త్యం, లడ్డూ విశిష్టతను తగ్గిస్తూ, కొన్ని కోట్ల మంది విశ్వాసాలకు విఘాతం కలిగిస్తూ.. చంద్రబాబు మాట్లాడితే.. అన్నీ తెలిసి నువ్వూ అదే మాట మాట్లాడావు.
– అలాంటి నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు.
– దేవుడి విషయంలో తప్పు జరుగుతున్నా, ఎత్తి చూపకపోవడం ఎంత వరకు సబబు? అలాంటి నీవు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు.
– అదే నా సనాతన ధర్మం వైఖరి.
– తిరుపతిలో సరుకులు, నెయ్యి సేకరణకు ఒక రొబొస్టు విధానం ఉంది. స్వామివారి పవిత్రతను తగ్గిస్తూ, మనమే అలా మాట్లాడడం ఏ విధంగా ధర్మం?.
– సుప్రీంకోర్టు ఇంత ఆక్షేపించినా, చంద్రబాబు చేసిన తప్పు ఎత్తి చూపినా, ఆయన స్వయంగా వేసుకున్న సిట్ను రద్దు చేసినా.. చంద్రబాబులో మార్పు లేదు.
– ఒక అబద్దాన్ని నిజం చేయడానికి మళ్లీ మళ్లీ అబద్ధాలు చెబుతున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామితో ఆడుకుంటున్నాడు.
– ఆయనకు పరిహారం తప్పదు. తెలిసి తెలిసి వెంకటేశ్వరస్వామివారితో ఆడుకుంటున్నాడు.
– సుప్రీంకోర్టు అబ్జర్వేషన్లు ఇలా ఉన్నప్పుడు, టీటీడీ ఈఓ మాటలు రికార్డుగా ఉన్నప్పుడు.. నిజానికి అక్కడ ఏమీ జరగలేదు కాబట్టి.. సిట్ అవసరం లేదు.
– కానీ ఎందుకా పని చేస్తున్నారంటే.. అక్కడ ఏదో జరిగినట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారు.
– అక్కడ ఏమీ జరగకపోయినా, అబద్ధాలకు రెక్కలు కట్టి, ప్రచారం చేస్తున్నారు.