తిరుపతిలో భక్త కనకదాస పీఠం ఏర్పాటు
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
తిరుపతి : ప్రఖ్యాతగాంచిన తిరుపతి పట్టణంలో భక్త కనకదాస పీఠం ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భక్త కనకదాస విగ్రహాన్ని కర్ణాటక ప్రభుత్వం పథకాల అమలు చైర్మన్ మాజీ మంత్రివర్యులు రేవణ్ణ, సద్గురు నిరంజన మహానంద స్వామీజీ కర్ణాటక ఎమ్మెల్యే బసవరాజు శివన్నవార్,ఎంపీలు బీకే పార్థసారథి, బస్తిపాటి నాగరాజుతో కలిసి మంత్రి సవిత ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నీతి నిజాయితీకి కురుబలు నిలువెత్తు నిదర్శనమన్నారు. కురుబల అభివృద్ధికి టీడీపీ అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అన్న ఎన్టీఆర్ బీసీలకు రాజకీయ వెన్నుదన్నుగా నిలిచారన్నారు. కురుబలకు రాజకీయ ప్రాధాన్యమిచ్చారన్నారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన సంజీవరెడ్డి రామచంద్రారెడ్డికి ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశమిచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వాల ప్రోత్సాహంతో రామచంద్రారెడ్డి 14 శాఖలకు మంత్రిగా పనిచేశారన్నారు. తర్వాత ఎంపీ బీకే పార్థసారథికి కూడా టీడీపీ రాజకీయ అండ అందించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కురుబలకు చెందిన ఇద్దరు ఎంపీలుగా, తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కురుబలకు అండగా నిలిచిందన్నారు. విద్యతోనే కురుబల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తిరుపతిలో భక్త కనకదాస పీఠం ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ఇదే విషయమై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి సవిత వెల్లడించారు. కురుబల ఆర్థికాభివృద్ధికి గొర్రెలు, మేకల ఫాం యూనిట్లు అందజేయనున్నట్లు తెలిపారు. గొర్రెలు, మేకలకు ఇన్స్యూరెన్స్ సౌకర్యం కూడా కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కురుబ సామాజిక వర్గీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![]()
