తల్లికి వందనం ద్వారా 67.27 లక్షల మంది విదార్థులకు రూ.8,745 కోట్ల సాయం
అర్హులు ఎంతమంది ఉన్నా సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది
గత ప్రభుత్వం కంటే ఏడాదికి రూ.3,205 కోట్లు అదనంగా కూటమి ప్రభుత్వ సాయం
ఐదేళ్లలో రూ.16వేల కోట్లు అదనంగా తల్లుల అకౌంట్లలో కూటమి ప్రభుత్వం జమ
9,600 పాఠశాలల్లో వన్ క్లాస్, వన్ టీచర్
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చాలని తల్లిదండ్రులను కోరుతున్నా
వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వానిది
రూ.2వేలు నా బ్యాంక్ అకౌంట్ లో పడినట్లు 24 గంటల్లో నిరూపించాలి, లేనిపక్షంలో తీవ్రమైన పరిణామాలు
తల్లికి వందనం పథకంపై విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్
ఉండవల్లి:
అర్హులు ఎంతమంది ఉన్నా తల్లికి వందనం సాయం అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తల్లికి వందనం పథకంపై ఉండవల్లి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. బాబు సూపర్ సిక్స్ లో ప్రధానమైన హామీ తల్లికి వందనం. ఈ తల్లికి వందనం ద్వారా 8,745 కోట్ల రూపాయలను 67,27,000 విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమచేయడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి తరగతి, ఇంటర్ మొదటి ఏడాది పిల్లలు చేరిన తర్వాత వారి తల్లుల అకౌంట్లలో కూడా నిధులు జమచేయడం జరుగుతుంది. తల్లి లేని పిల్లలు ఉంటే వారి తండ్రి అకౌంట్ లేదా గార్డియన్ అకౌంట్ లో ఈ నిధులు జమచేయడం జరిగింది. అనాథాశ్రమాల విషయంలో రీవాలిడేట్ చేసుకుని జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు చేసి వారి అకౌంట్లలో నేరుగా నిధులు జమచేయడం జరుగుతుంది.
అర్హులు ఎంతమంది ఉన్నా సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది
గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడు, ఎలా చేస్తామనేది చెప్పడం జరిగింది. ప్రజలందరినీ నేను కోరేది ఒక్కటే.. అర్హులు ఎంతమంది ఉన్నా సాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ నిధులు ఇంకా అకౌంట్ లో జమచేసే ప్రక్రియ జరుగుతోంది. ఈ రోజు, రేపు కూడా అకౌంట్లలో నిధులు జమ అవుతాయి. సోమవారం నుంచి వారి అకౌంట్లలో నిధులు జమకానిపక్షంలో జూన్ 26 వరకు సమయం ఇస్తున్నాం. మనమిత్ర వాట్సాప్ ద్వారా లేక జీఎస్ డబ్ల్యూఎస్ కి వెళ్లి మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
30 లక్షల మంది బీసీ సోదరులకు తల్లికి వందనం సాయం అందజేత
రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు, ఇంటర్ రెండో ఏడాది పిల్లలను చూస్తే సుమారు 30 లక్షల మంది బీసీ సోదరులకు తల్లికి వందనం వర్తించింది. 12 లక్షల మంది ఎస్సీ సోదరులకు, 4.26 లక్షల మంది ఎస్టీ సోదరులకు, సుమారుగా 66వేల మంది మైనార్టీ సోదరులకు, 8.5 లక్షల మంది ఈబీసీ సోదరులకు తల్లికి వందనం అందించడం జరిగింది. దాదాపు ఇప్పటికే ఒక్కరే సంతానం ఉన్న 18.55 లక్షల మంది తల్లుల అకౌంట్ లో రూ.13వేల రూపాయలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది. ఇద్దరు పిల్లలు ఉన్న 14.55 లక్షల మంది తల్లులకు రూ.26వేలు కూటమి ప్రభుత్వం అందించడం జరిగింది. ఇందులో సుమారుగా 29.10 లక్షల మంది పిల్లలు కవర్ అవుతారు. ముగ్గురు పిల్లలు ఉన్న 2.10 లక్షల మంది తల్లుల అకౌంట్ లో రూ.39వేలు కూటమి ప్రభుత్వం అందజేయడం జరిగింది. ఇందులో 6.32 లక్షల మంది పిల్లలు కవర్ అయ్యారు.
వైసీపీ హయాంలో 42 లక్షల మందికే అమ్మఒడి
గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఇస్తామన్నారు. వాళ్లు ఇవ్వకుండా కేవలం 42 లక్షల మంది పిల్లలకే ఆనాడు అమ్మఒడి ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 67,27,000 మంది పిల్లలకు నిధులు జమచేయడం జరిగింది. గతంలో ఏడాదికి రూ.5,540 కోట్ల రూపాయలు వాళ్ల కార్యక్రమానికి ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం రూ.8,745 కోట్లు తల్లుల అకౌంట్ లో నిధులు జమచేయడం జరిగింది. అంటే సుమారుగా రూ.3,205 కోట్లు అదనంగా కూటమి ప్రభుత్వం అందజేస్తోంది. అంటే ఐదు సంవత్సరాల్లో రూ.16వేల కోట్ల రూపాయలు అదనంగా తల్లుల అకౌంట్లలో కూటమి ప్రభుత్వం నిధులు జమచేయబోతోంది.
మనమిత్ర వాట్సాప్, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గ్రీవెన్స్ నమోదుకు అవకాశం
ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకు మేం ఇస్తాం. అర్హులు ఎంతమంది ఉన్నా ఈ పథకం అందించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక మంత్రి గారితో కూడా కూర్చొని నేను సమీక్షించడం జరిగింది. ఎక్కడైనా చిన్న,చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సమీక్షించడం జరిగింది. 2 శాతం మందికి వాళ్ల అకౌంట్ యాక్టివ్ గా లేకపోవడంతో నిధులు తిరిగి ప్రభుత్వానికి వచ్చాయి. ఆ తల్లులందరినీ ఆయా అకౌంట్లను యాక్టివ్ చేసుకోవాలని చెప్పాం. వారికి ఎస్ఎమ్ఎస్ కూడా వెళ్తుంది. వారు యాక్టివ్ చేసుకున్న వెంటనే నిధులు నేరుగా వాళ్ల అకౌంట్ లో జమవుతాయి. మనమిత్ర ద్వారా కూడా గ్రీవెన్స్ నమోదు చేయడానికి ఆస్కారం ఉంటుంది. గ్రామ, వార్డు సచివాలయానికైనా వెళ్లొచ్చు, లేదా ఇంట్లోనే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా గ్రీవెన్స్ తెలపవచ్చు.
మొదటిరోజే 80శాతం మంది పిల్లలకు డా.సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ అందజేత
ప్రభుత్వ విద్యలో తల్లికి వందనం అనేది ఒక భాగం. ఒక్కసారి ఫీల్డ్ లో చూస్తే 80శాతం మంది పిల్లలకు మొదటి రోజే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి స్కూల్ కిట్ అందజేయడం జరిగింది. మొదటి రోజే పుస్తకాలు, యూనిఫాం, బ్యాగ్, షూస్, సాక్స్ అందజేయడం జరిగింది. గతంలో ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు. మేం అందించాం. ఆ 20శాతం కూడా 20వ తేదీలోగా అందిస్తాం. గతంలో ఇంటర్ విద్యార్థులకు స్కూల్ కిట్ తీసేశారు. మేం ఏప్రిల్ మాసంలోనే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరిన వారికి స్కూల్ కిట్ కూటమి ప్రభుత్వం అందజేయడం జరిగింది. నాదెండ్ల మనోహర్ గారు, మేం అందరం చర్చించి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్న భోజన పథకంలో అమలుచేయడం జరిగింది.
9,600 పాఠశాలల్లో వన్ క్లాస్, వన్ టీచర్
మూడోది చాలా కీలకమైన సంస్కరణ తీసుకువచ్చాం. వన్ క్లాస్, వన్ టీచర్ మోడల్. ప్రాథమిక పాఠశాలల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 1,200 పాఠశాలల్లో వన్ క్లాస్, వన్ టీచర్ ఉన్నారు. ఈ రోజు మేం గర్వంగా చెబుతున్నాం 9,600 పాఠశాలల్లో వన్ క్లాస్, వన్ టీచర్ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది. అంటే దాదాపు 8 రెట్లు పెంచాం. వన్ క్లాస్—వన్ టీచర్ అనేది మా నినాదం. అప్పుడే లెర్నిగ్ అవుట్ కమ్స్ బాగావస్తాయి. 1,200 పాఠశాలల నుంచి 9,600 పాఠశాలలకు తీసుకువచ్చాం. నాలుగో కీలక సంస్కరణ మొన్న బడ్జెట్ చూస్తే ఆర్థికమంత్రి సహకారంతో ప్రభుత్వ పాఠశాలలన్నింటికి నేడు ఉచిత కరెంట్ అందిస్తున్నాం. డబ్బులు ఇవ్వడమే కాదు.. పిల్లలు బాగా చదివించాలనే బాధ్యత తీసుకున్నాం. అసెంబ్లీలో మీరు చూస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో తీసుకోని విధంగా గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ నిర్ణయం మేం తీసుకున్నాం. ఇది చెప్పడం చాలా తేలిక. కానీ సంస్కరణలు తీసుకురావాలి, మొత్తం వ్యవస్థనే సెట్ చేయాల్సిన అవసరం ఉంది.
16వ తేదీ నాటికి టీచర్ల బదిలీల ప్రక్రియ పూర్తి
ఇప్పుడు టీచర్ల ట్రాన్స్ ఫర్లు కూడా జరుగుతున్నాయి. నేను ఆన్ లైన్ మెకానిజం పెట్టాలనుకున్నా. ఉపాధ్యాయులు మాన్యువల్ పెట్టాలని కోరడం జరిగింది. ఎమ్మెల్సీలు అందరితో చర్చించిన తర్వాత మాన్యువల్ మెకానిజానికి మేం రివర్ట్ అయ్యాం. దీనివల్ల ఆలస్యమైంది. లేదంటే నా లక్ష్యం ఏమిటంటే.. పిల్లలు మొదటిరోజు స్కూల్ కు వెళ్లినప్పుడు ఆ సంవత్సరం ఉన్న టీచర్లు మొదటిరోజే వస్తారనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ ఇది సాధించలేకపోయాం. దానివల్ల నేను చాలా బాధపడుతున్నా. అధికారులు అహర్నిశలు కష్టపడుతున్నారు. సోమవారం నాటికి టీచర్ల బదిలీలన్నీ పూర్తిచేసి మొత్తం వ్యవస్థను స్టెబిలైజ్ చేస్తాం. పదో తరగతి ఫలితాలు, ఇంటర్ ఫలితాల విషయంలో మార్పు చేశాం. దానికంటే బెటర్ చేయాలనే లక్ష్యంతో మొత్తం విద్యాశాఖ అహర్నిశలు కష్టపడుతోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చాలని తల్లిదండ్రులను కోరుతున్నా
ప్రజలందరికీ ఒకటే చెబుతున్నా.. గతంలో ప్రభుత్వ పాఠశాలల గురించి నాకు తెలుసు. కరెక్ట్ గా డేటా లేదు. ఎంతమంది పిల్లలు చదువుతున్నారో తెలియని పరిస్థితి. అడుగడుగునా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. అలాకాకుండా అందరి ఆమోదంతో అద్భుత సంస్కరణలు తీసుకువచ్చాం. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లలను చేర్చాలని తల్లిదండ్రులందరినీ కోరుతున్నా. వాళ్లను ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మనం ఇతర రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ మోడల్స్ గురించి మాట్లాడాం. ఏడాది సమయం ఇవ్వండి.. ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటో చూపిస్తా. మొత్తం డిపార్ట్ మెంట్ కమిటెడ్ గా పనిచేస్తున్నాం. మీరు టెక్స్ట్ బుక్స్ చూడండి. నేను ఏదైతే శాసనసభ సాక్షిగా చెప్పానో వాటిని అమలుచేశాం. రాజకీయ నాయకుల ఫోటోలు లేవు. బ్యాగ్ బరువు తగ్గించేందుకు కృషిచేశాం. సీరియస్ గా ఆలోచించి సంస్కరణలు తీసుకువచ్చాం. అందుకే ప్రజలందరినీ కోరుతున్నా.. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి.
రూ.2వేలు నా బ్యాంక్ అకౌంట్ లో పడినట్లు నిరూపించని పక్షంలో తీవ్రమైన పరిణామాలు
ప్రతిపక్ష పార్టీ నాపైన తీవ్ర ఆరోపణలు చేసింది. వాళ్లు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్లకు నేను 24 గంటల సమయమిస్తున్నా. రూ.2వేలు నా బ్యాంక్ అకౌంట్ కు వచినట్లు నిరూపించండి. లేదా ఆ స్టేట్ మెంట్ ఉపసంహరించుకోండి. లేనిపక్షంలో చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్ గా దీనిపైన ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వైసీపీ అనేది ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజం చేసేందుకు ప్రయత్నిస్తుంది. 2019 ఎన్నికల్లో సొంత బాబాయిని వారే చంపి, నింద మాత్రం మా నాయకుడు చంద్రబాబు గారిపై వేశారు. మేం ఆనాడు సమర్థంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు చూడండి.. చెల్లెళ్లే చెబుతున్నారు ఏం జరిగిందో. చాలా అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు.
గతంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రికి బేసిక్స్ తెలియవు
యూడైస్ డేటా గురించి మాట్లాడుతున్నారు. గతంలో పనిచేసిన విద్యశాఖ మంత్రికి కనీసం బేసిక్స్ తెలియవు. యూడైస్ లో ప్రీప్రైమరీ, ఎల్ కేజీ, యూకేజీ పిల్లలు ఉంటారు. ఈ స్కీమ్ వారికి వర్తించదు. గత ప్రభుత్వం గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో(జీఈఆర్) చూపించేందుకు 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారిని తీసుకువచ్చి ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వారిని ఎన్ రోల్ చేయడం జరిగింది. పక్క రాష్ట్రంలో చదువుతున్న పిల్లలను తీసుకువచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్నారని చూపించడం జరిగింది. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. విద్యార్థులను డ్రాప్ బాక్స్ లో పెట్టారు. మొత్తం పరిశీలిస్తే దొంగ లెక్కలు ఉన్నాయని తేలింది. ఒక విద్యాశాఖ మంత్రికి ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారో తెలుసుకునేందుకు నాకు వంద రోజులు పట్టింది. గతంలో విద్యాశాఖను ఏవిధంగా నడిపించారో నాకు తెలియదు. ఏదో నెంబర్లు ఉన్నాయంటే.. వారెందుకు అమ్మఒడి ఇవ్వలేదు? అర్హులు ఎంతమంది ఉన్నారో వారందరికీ ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మొత్తం లిస్ట్ జీఎస్ డబ్ల్యూఎస్ లో పెడతాం. సాయం అందకపోతే ఎందుకు రాలేదో మనమిత్రకు వెళ్లి తెలుసుకోవచ్చు. కరెక్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం.
విద్యార్థులను సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది
గతంలో విద్యశాఖ మంత్రిగా పనిచేసిన వారికి డిక్షనరీలో ఏముందో తెలియదు. వాళ్ల డిక్షనరీలో దేవుడంటే ఏముంది, కూటమి ప్రభుత్వ డిక్షనరీలో దేవుడంటే ఏముందో అసెంబ్లీలో చదివి చెప్పాం. మేం డెప్త్ కు వెళ్తున్నాం. పిల్లలను సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మాపైన ఉంది. చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజరీగా పెట్టుకున్నాం. విలువలపై ఆయన ఏ కంటెంట్ అయితే తయారుచేశారో అది పిల్లలకు ప్రింట్ చేసి ఇస్తున్నాం. మేం చాలెంజ్ గా తీసుకుని పనిచేస్తున్నాం.
గతంలో ఉన్న నిబంధనలే తల్లికి వందనంలో కూడా ఉన్నాయి
తల్లికి వందనం పథకంలో గత ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ నే ఫాలో అయ్యాం. మమల్ని ప్రశ్నించే హక్కు వారికి ఎక్కడుంది? డీఎస్సీ ఆపేందుకు 24 కేసులు వేశారు. ప్రమాణాలు పెంచితే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వస్తారని నేను బలంగా నమ్ముతున్నా. మా ఉపాధ్యాయులపై నాకు విశ్వాసం ఉంది. తల్లికి వందనం అమలుపై ఫీడ్ బ్యాక్ చాలా అద్భుతంగా ఉందని, ఉదయం నుంచి నాకు వేల స్క్రీన్ షాట్లు, వీడియోలు కూడా పెడుతున్నారు. వారంతా చాలా సంతోషంగా ఉన్నారన్నారు.