డిపాజిటర్లకు పూర్తి న్యాయం చేయాలి
దుర్గా కో ఆపరేటివ్ బ్యాంక్ డిపాజిటర్లకు వడ్డీ సహా మొత్తం చెల్లించాలి
ప్రభుత్వం, నగరంలోని ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకోవాలి
సహకార శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, గత పాలకవర్గంల తప్పులే డిపాజిటర్లకు శాపంగా మారాయి
డిపాజిటర్లకు అన్యాయం జరిగితే పోరాటం సాగిస్తాం
సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం
విజయవాడ: వన్ టౌన్ లోని దుర్గా కో ఆపరేటివ్ బ్యాంక్ లో డిపాజిట్ చేసిన ప్రతి ఒక్కరికీ వడ్డీతో సహా అసలు మొత్తం చెల్లించాలని సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. వన్ టౌన్ లెనిన్ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దుర్గా కో ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ అధికారులు ప్రకటించడంతో వేలాది మంది డిపాజిట్ దారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఈ బ్యాంక్ లో రిక్షా కార్మికుడి నుంచి రిటైర్డ్ ఉద్యోగుల వరకు వేలాది మంది రూ.5 వేల నుంచి రూ. 10లక్షల ఇంకా ఎక్కువ మొత్తాల వరకు డిపాజిట్లు చేశారని తెలిపారు. ఇతర జాతీయ బ్యాంకులతో పోలిస్తే అధిక వడ్డీ వస్తుందని, రిటైర్మెంట్ తర్వాత తమకు ఆర్థిక భరోసా ఉంటుందని చాలామంది ఉద్యోగులు రూ.10లక్షల వరకు డిపాజిట్ చేశారని వివరించారు. కానీ గతంలో బ్యాంకు పాలకవర్గం తన ఇష్టానుసారం నిబంధనలకు విరుద్ధంగా వాస్తవ విలువ కన్నా భవనాలపై అధిక రుణాలు ఇవ్వడం, ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు చేయకపోవడం వల్ల రెండేళ్లుగా బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోయాయని చెప్పారు. బ్యాంకులో అక్రమాలు జరుగయతున్నా సహకార శాఖ అధికారులు పట్టించుకోలేదన్నారు. గతంలో బ్యాంక్ పాలకవర్గలు చేసిన తప్పులు, సహకార శాఖ అధికారుల నిర్లక్ష్యం డిపాజిటర్లకు శాపంగా మారిందన్నారు. తమ పిల్లలకు పెళ్లి చేసేందుకు దాచుకున్న డబ్బులు చేతికి అందక చాలామంది మానసికంగా కుంగిపోయి అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో డిపాజిటర్లతో కలిసి తాము ఆందోళన చేశామని, అప్పుడే అధికారులు, నగరంలోని ఎమ్మెల్యేలు, ఎంపీ జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి చొరవ చూపి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇప్పటికైనా ఆర్బీఐ నియమించే లిక్విడేటర్, సహకార శాఖ అధికారులు కలిసి గత పాలకవర్గలు, బ్యాంకు ఉద్యోగుల ద్వారా అప్పులన్నీ వసూలు చేసి, అదేవిధంగా ఈ బ్యాంకు ఇతర బ్యాంకులలో చేసిన డిపాజిట్లను పూర్తిగా విత్ డ్రా చేసి డిపాజిటర్లకు పూర్తిగా వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇందుకు ప్రభుత్వం కూడా తగిన సహకారం అందించాలని, ఆ దిశగా ఎమ్మెల్యేలు, ఎంపీ కృషి చేయాలని కోరారు. ఏ ఒక్క డిపాజిట్ దారునికి అన్యాయం జరిగినా సీపీఐ పోరాటానికి సిద్దమవుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు పంచదార్ల దుర్గాంబ, తాడి పైడియ్య, కార్యవర్గ సభ్యులు కేవీ భాస్కర్ రావు, కొట్టు రమణారావు పాల్గొన్నారు.