టీటీడీలో అవినీతిపై సీఎంకు ఫిర్యాదు
తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీగా అవినీతి అక్రమాలు జరిగి.. శ్రీవారి ఖజానాకు సుమారు రూ. 5 వందల కోట్లకుపైగా గండి పడిందని రాష్ట్ర విజిలెన్స్ అధికారులు నిర్దారించారు. గత రెండున్నర నెలలుగా టీటీడీలోని పలు విభాగాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. టీటీడీలోని 18 విభాగాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.
గత ఐదేళ్లలో టీటీడీలో భారీగా అవకతవకలు జరిగినట్లు పలువురు భక్తులతోపాటు బీజేపీ, జనసేన నేతలు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని ప్రభుత్వం స్టేట్ విజిలెన్స్ అధికారులను ఆదేశించడంతో ఈ ఏడాది జూన్ 25వ తేదీ నుంచి అధికారులు టీటీడీలో సోదాలు నిర్వహించారు. ప్రధానంగా వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని పాలక మండళ్లు ఇంజనీరింగ్ పనులకు సంబంధించి రూ. వేల కోట్ల నిధులను కేటాయించడంతో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ముడిసరుకులు కొనుగోళ్లు, శ్రీవారి దర్శనం టిక్కెట్ల కేటాయింపు, శ్రీవాణి ట్రస్టులో జరిగిన అక్రమాలపై అధికారులు దృష్టి సారించి ఆ విభాగాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహంచి పలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు.