దేశవ్యాప్తంగా పండ్ల రక్షణ కాగితపు సంచుల పై 18 శాతం జీఎస్టీ
ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశ్నకు బదులిచ్చిన కేంద్రం
ఢిల్లీ : పండ్ల రక్షణ కోసం ఉపయోగించే పేపర్ బ్యాగ్లపై దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 18% జీఎస్టీ అమలవుతోందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. ఫ్రూట్ ప్రొటెక్షన్ పేపర్ బ్యాగులపై జీఎస్టీ అనే అంశంపై టిడిపి ఎంపి కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నలకు సోమవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
అలాగే పండ్ల రక్షణ పేపర్ బ్యాగ్స్ కి సంబంధించి ప్రత్యేకంగా హెచ్.ఎస్. (Harmonized System) కోడ్ లేకపోవటం వల్ల గత ఐదేళ్లుగా వీటిపై వసూలైన జీఎస్టీ వివరాలు అందుబాటులో లేవన్నారు. పండ్ల రక్షణ పేపర్ బ్యాగ్లు HS కోడ్ 4819 కిందకు వస్తాయన్నారు. ఈ బ్యాగ్లపై జీఎస్టీ రేటు తగ్గించేందుకు ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళికలు లేవని మంత్రి స్పష్టం చేశారు. జీఎస్టీ రేట్లను జీఎస్టీ కౌన్సిల్ సూచనల మేరకు నిర్ణయించడం జరుగుతుందన్నారు. అయితే, ఇప్పటి వరకు జీఎస్టీ కౌన్సిల్ నుంచి ఈ ఉత్పత్తులపై రేటు తగ్గించేందుకు ఎటువంటి సిఫార్సులు అందలేదని మంత్రి పేర్కొన్నారు.