*ఎన్టీఆర్ జిల్లా, ఫిబ్రవరి 27, 2025*
జిల్లాలో 65.69 శాతం పోలింగ్
78,063 మంది ఓటర్లకుగాను 51,279 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు
అధికారులు, సిబ్బంది సమన్వయంతో పోలింగ్ ప్రశాంతం
అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పారదర్శకంగా పోలింగ్
పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు
మార్చి 3వ తేదీన గుంటూరులో కౌంటింగ్ ప్రక్రియ
పోలింగ్ ప్రక్రియను విజయవంతం చేసిన అధికారులు, సిబ్బంది ప్రతిఒక్కరికీ అభినందనలు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని, 65.69 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. 78,063 మంది ఓటర్లకు గాను 51,279 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినందున ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. మద్యం దుకాణాలు మూసివేయడం, పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయడం, స్థానికంగా పాఠశాలలకు సెలవు ప్రకటించడం, ప్రత్యేక తక్షణ స్పందన బృందాలు అప్రమత్తంగా ఉండటం.. ఇలాంటి చర్యలన్నీ పోలింగ్ ప్రశాతంగా ముగిసేందుకు దోహదం చేసినట్లు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో క్యూ లైన్లు పెద్దగా ఉన్నప్పటికీ అవసరమైన నీడ, తాగునీరు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం వల్ల ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. గర్భిణీలు, విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించి.. ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. మార్చి 3వ తేదీన గుంటూరులో కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడంలో భాగస్వాములైన అధికారులు, సిబ్బందికి కలెక్టర్ లక్ష్మీశ అభినందనలు తెలిపారు. పోలింగ్ సజావుగా జరగడంలో మీడియా కూడా కీలకపాత్ర పోషించినట్లు పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో కలెక్టర్ విస్తృత పర్యటన
ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా కలెక్టర్ లక్ష్మీశ ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల పరిశీలనలో నిమగ్నమయ్యారు. తొలుత విజయవాడ పటమటలోని కోనేరు బసవయ్య చౌదరి జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలోని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు, సిబ్బందికి మార్గనిర్దేశనం చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా భద్రతా చర్యలను కొనసాగించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. జగ్గయ్యపేటలోని గెంటేల వెంకట జోగయ్య జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. తాగునీరుతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వైద్య శిబిరాలను పరిశీలించారు. నందిగామతో పాటు జి.కొండూరులోనూ పర్యటించి పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించారు.
కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్
జిల్లాలో పోలింగ్ ప్రక్రియ సాగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. 112 పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్క్యాస్టింగ్తో పాటు కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ కేంద్రం (సీసీసీ) ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం నుంచి కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం నిరంతర పర్యవేక్షణలో భాగమైంది. కలెక్టర్ లక్ష్మీశ కూడా సీసీసీ నుంచి జిల్లావ్యాప్తంగా పోలింగ్ సరళిని పరిశీలించారు. సహాయ రిటర్నింగ్ అధికారి, డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) నోడల్ అధికారి కె.శ్రీనివాసరావు తదితరులు కంట్రోల్ రూం కార్యకలాపాల్లో భాగస్వాములయ్యారు.