జర్నలిస్టులకు ఏం చేయాలో తెలపమని కోరిన సీఎం
అమరావతి: రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం తన ఛాంబర్ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధిని ఏపీ ఎంప్యానల్డ్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్(రి. నెం.312/2024) రాష్ట్ర ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టులకు, స్మాల్ పత్రికలకు సహకార అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎంప్యానల్డ్ న్యూస్ పేపర్స్ తో పాటు ఇంకా ఎంప్యానల్ మెంట్ కాని స్మాల్ దినపత్రికలు, పిరియాడికల్స్ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి అన్ని విధాల సహకారం అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలే కాకుండా వారిక ఇంకా ఏ విధంగా మేలు చేయాలనే విషయాలపై ప్రతిపాదనలు పంపాలని ఇటీవల సమాచార, పౌర సంబంధాల శాఖ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు.
అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు సమాచార,పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాంసు శుక్లాను సెక్రటేరియట్ లో కలిసి ఎంప్యానల్డ్ స్మాల్ దిన పత్రికలకు ప్రకటనలు విడుదల చేసి సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎంప్యానల్ మెంట్ లేని స్మాల్ దిన పత్రికలకు ఎంప్యానల్ మెంట్ సదుపాయం కల్పించాలని, తెలంగాణలో మాదిరిగా వార,పక్ష,మాస పత్రికలకు ప్రకటనలు విడుదల చేసి సహకరించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డైరెక్టర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రి పార్థసారధిని, డైరెక్టర్ హిమాంస శుక్లాను కలిసిన అసోసియేషన్ ప్రతినిధి బృందంలో ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్ కుమార్, నందిగం కోటేశ్వరరావు, కార్యదర్శి తొండెపు మారుతీ చౌదరి తదితరులు ఉన్నారు.