రాష్ట్ర పునర్నిర్మాణానికి అంతా కలిసి నడవాల్సిన సమయం ఇది
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్ని శాఖలకు ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్
టీడీపీ అనుభవం, జనసేన పోరాటం, బీజేపీ మద్దతుతో రాష్ట్రం పురోగమనం
పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు, గౌరవం ఉంటుంది
జనసేనలో చేరిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు
కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం ప్రసంగించిన జనసేన
పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్
‘రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ అన్ని రంగాలకు తగు ప్రాధాన్యం ఇచ్చేలా కూటమి ప్రభుత్వం నేడు అసెంబ్లీలో కలెక్టివ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. రూ.1.3 లక్షల కోట్ల బకాయిలతో కలిపి ఈ బడ్జెట్ ను ఎంతో జాగ్రత్తగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అనుగుణంగా రూపొందించాం. సంక్షేమంతోపాటు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములవ్వాల’ని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోరారు. సోమవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ చెందిన పలువురు కార్పొరేటర్లు, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు జనసేన పార్టీలో చేరారు. వీరందరికి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటాను. నేను ఒకరికి ఇచ్చే వ్యక్తినే తప్ప తీసుకునే వ్యక్తిని కాదు. దశాబ్ధ కాలం పాటు ఎన్నో పోరాటాలు చేసి ప్రతికూల పరిస్థితుల్లో కూడా పార్టీని ముందుకు నడిపించాం. పార్టీకి ఈ రోజు క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తల బలం ప్రజాదరణ ఉన్నాయి. పార్టీలోకి వచ్చే నాయకులు దానిని మరింత పెంపొందించి పార్టీకి మరింత బలంగా మారాలి. రాష్ట్ర నిర్మాణంలో అందరం కలిసి ముందుకు నడవాల్సిన సమయం ఇది. విభిన్న ఆలోచనలు ఉన్న వ్యక్తుల కలయిక రాష్ట్రానికి అవసరం. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు, గౌరవం ఉంటుంది.
ఏమీ ఆశించి రాజకీయాల్లోకి రాలేదు
పార్టీని మొదలు పెట్టినప్పుడు ప్రజల కోసం పోరాడాలనే బలమైన ఆకాంక్ష తప్ప మరే ఆలోచన లేదు. ఎన్నో కష్టాలు వచ్చినా పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లాం. ఎన్నో విపత్కర పరిస్థితుల్లో కూడా ముందుకు కదిలాం. 2009 నుంచి ఎమ్మెల్సీ హరిప్రసాద్ నా వెన్నంటే ఉన్నారు. పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కష్టకాలంలో అండగా నిలబడ్డారు. 2016లో మంగళగిరిలో ఇదే చోట కార్యాలయాన్ని నిర్మించాలని భావించినప్పుడు ఇక్కడికి ఎవరూ రారని చాలా మంది చెప్పారు. మీడియా ప్రతినిధులు కూడా ఇక్కడికి రావడానికి ఇబ్బందులుపడతారని చాలా మంది సలహాలు ఇచ్చారు. అప్పట్లో కేవలం పార్టీ కార్యాలయం తప్ప చుట్టుపక్కల ఏమీ ఉండేవి కావు. అలాంటి పరిస్థితి నుంచి నేడు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని అధునాతనంగా నిర్మించుకునే స్థాయికి వచ్చాం. దీనిలో మా శ్రమతోపాటు పార్టీ కోసం రేయింబవళ్లు కష్టపడిన జన సైనికులు, వీర మహిళల కష్టమే ఎక్కువ. పార్టీ ఇప్పుడు అప్రతిహతంగా ముందుకు వెళ్తున్న సమయంలో పార్టీ కోసం కష్టపడిన వారికి కృతజ్ఞతలు. రాష్ట్రం కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం 2024లో జనసేన పార్టీ పోరాటం ఓ చోదక శక్తిగా నిలిచింది. తెలుగుదేశం పార్టీ అనుభవం, భారతీయ జనతా పార్టీ కేంద్ర మద్దతు భవిష్యత్తులో కూడా రాష్ట్రానికి మేలు చేసేదిగా ఉంటుందని ఆకాంక్షిస్తున్నాను” అన్నారు.
పార్టీలో చేరిన స్థానిక సంస్థల ప్రతినిధులు, సీనియర్ నేతలు
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఉమ్మడిశెట్టి రాధిక, 48వ డివిజన్ కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి, 51వ డివిజన్ కార్పొరేటర్ మరుపిళ్ల రాజేష్, 38వ డివిజన్ కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీరావు, జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం జెడ్పీటీసీ యేసుపోగు దేవమణి, అమలాపురం మాజీ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ గుణిశెట్టి చినబాబు, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన సామాజికవేత్త, ఎన్.వి.ఆర్. ట్రస్ట్ ఫౌండర్ ఎన్.వేణుగోపాల్ రెడ్డి, ధర్మవరం మున్సిపాలిటి నుంచి ఎం.రమణమ్మ, తోపుదుర్తి వెంకట్రాముడు, సరితాల ఆషాబీ, సరితాల మహ్మద్ బాషా, పి.రమాదేవి, వై.రాజు, తొండమాల ఉమాదేవి, రవిప్రసాద్, నాగార్జున, సోమశేఖర్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు పి.హరిప్రసాద్, పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, పార్టీ ఎన్డీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ నాయకులు మండలి రాజేష్, పంచకర్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు.