06-12-2024
జననీ శిశు సురక్షా కార్యక్రమం కింద ఎపిలో గత ఐదేళ్లలో వైద్య సేవలు పొందిన గర్భిణుల సంఖ్య 14, 05, 394
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి వెల్లడి
విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) లోక్ సభలో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా మంత్రి బదులు
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద జననీ శిశుసరుక్షా కార్యక్రమంలో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను తల్లి ఆరోగ్య సేవల కోసం రూ.81.74 కోట్లు విడుదల చేయగా, రూ. 65.79 కోట్లు వినియోగం జరిగిందని. అలాగే అదే ఏడాదికి గాను శిశు ఆరోగ్య సంరక్షణ కోసం రూ. 3.78 కోట్లు విడుదల చేయగా, రూ.3.75 కోట్లు వినియోగించారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ లోక్ సభలో శుక్రవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. టిడిపి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ పార్లమెంట్ లో జననీ శిశు సరుక్షా కార్యక్రమం పై పలు ప్రశ్నలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖను అడగటం జరిగింది.
ఎంపి కేశినేని శివనాథ్ జననీ శిశు సురక్షా కార్యక్రమం (JSSK) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో ఎంత వినియోగం జరిగిందో జిల్లాల వారీగా వివరాలు తెలపాలని కోరారు. అలాగే గత ఐదేళ్లలో ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన లబ్ధిదారుల సంఖ్య చెప్పాలని అడిగటం జరిగింది. ఈ ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ లోక్ సభలో శుక్రవారం లిఖితపూర్వకంగా బదులిచ్చారు.
గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం కింద లబ్ధిపొందిన గర్భిణుల సంఖ్య 14 లక్షల 5 వేల 394 కాగా,. , 2019-20 లో 3,01,868 మంది గర్భిణులు, 2020-21 లో 2,72,922 మంది గర్భిణులు, 2021-22 లో 2,96,983 మంది గర్భిణులు, 2022-23లో 2,72,620 మంది గర్భిణులు, 2023-24 లో 2,61,001 మంది గర్భిణులు లబ్ధి పొందినట్లు తెలిపారు.
ఎపిలో ఈ పథకం కింద గత ఐదేళ్లలో వైద్య సేవలు పొందిన శిశువుల సంఖ్య 2 లక్షల 04 వేల 142 కాగా,
2019-20 లో 30,466 మంది శిశువులు, 2020-21లో 34,513 మంది శిశువులు, 2021-22 లో 50,504 మంది శిశువులు, 2022-23 లో 45,128 మంది శిశువులు, 2023-24 లో 43,531 మంది శిశువులకు వైద్య సేవలు అందించినట్లు చెప్పారు.
2023-2024 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం జననీ శిశు సురక్షా కార్యక్రమం (JSSK) కింద తల్లి, బిడ్డల సంరక్షణ కోసం మంజూరు చేసిన రూ. 29.09 కోట్లలో, రూ.20.53 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.