ఎన్టీఆర్ జిల్లా, మార్చి 10, 2025
చేయిచేయి కలిపి వాననీటిని ఒడిసి పడదాం
వాననీటి సంరక్షణతో భూగర్భ జలాలకు కొత్త జీవం
నీటి సంరక్షణపై ప్రతిఒక్కరికీ అవగాహన అవసరం
జల్ సంచయ్ జన్ భాగీదరి ప్రగతికి అధికారులు కృషిచేయాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
వాననీటి సంరక్షణతో భూగర్భ జలాలు పెరుగుతాయని.. ఆహార భద్రతకు భరోసా కల్పించడంలో భూగర్భ జలాలది కీలకపాత్ర అని.. జిల్లాలో జల్ సంచయ్ జన్ భాగీదరి (జేఎస్ఎస్బీ) కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు.
సోమవారం కేంద్ర జలశక్తి మంత్రివర్యులు సీఆర్ పాటిల్ అధ్యక్షతన న్యూఢిల్లీ నుంచి వర్చువల్గా జల్శక్తి అభియాన్-క్యాచ్ ది రెయిన్, జల్ సంచయ్ జన్ భాగీదరిపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ వీసీకి జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. డ్వామా, భూర్భ జలాలు, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులతో కలిసి హాజరయ్యారు. జల్ సంచయ్ జన్ భాగీదరి కింద అమలవుతున్న కార్యక్రమాలు, ప్రస్తుత స్థితిగతులు, భవిష్యత్ కార్యాచరణపై మంత్రివర్యులు మార్గనిర్దేశం చేశారు. వీసీ అనంతరం కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో మాట్లాడుతూ ఒకవైపు వాననీటిని సంరక్షించుకోవడంతో పాటు భూగర్బ జలాల దుర్వినియోగాన్ని అడ్డుకోవడమూ చాలా ముఖ్యమని.. వర్షపు నీటి సంరక్షణపై ప్రతిఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరముందన్నారు. వాననీటి సంరక్షణ వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు వాననీటిని సరైన విధంగా నిల్వ చేసుకొని వినియోగించుకోవడం ద్వారా భూగర్భ జలాలపై ఒత్తిడిని తగ్గించవచ్చన్నారు. జలం పరంగా భవిష్యత్తులో ముప్పు ఎదురుకాకుండా ఉండాలంటే ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా వాననీటి సంరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. ఈ దిశగా చేసే ప్రయాణంలో జిల్లాలో జల్ సంచయ్ జన్ భాగీదరి కార్యక్రమంలో ప్రగతికి చేయీచేయీ కలపాలన్నారు.
*ఒక రైతు ఒక నీటి కుంట నినాదంతో ముందుకెళ్లాలి:*
ఉపాధి హామీ పథకం అనుసంధానంతో పైసా ఖర్చు లేకుండా రైతుల పొలాల్లో నీటి కుంటల వల్ల పంటకు కావాల్సిన నీరు అందడమే కాకుండా భూగర్భ జలాల వృద్ధికీ దోహదం చేస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. మృత్తికా, పోషకాల క్రమక్షయాన్ని అడ్డుకునేందుకు ఈ కుంటలు ఉపయోగపడతాయని.. బహుళ ప్రయోజనాలున్న నీటి కుంటల గురించి రైతులకు పొలం పిలుస్తోంది వంటి కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 289 గ్రామ పంచాయతీల పరిధిలో 2,713 కుంటలు మంజూరయ్యాయని.. వీటి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు కృషిచేయాలన్నారు. అదేవిధంగా 440 అంగన్వాడీ కేంద్రాల్లో రూఫ్ టాప్ వాన నీటి సంరక్షణ నిర్మాణాలు మంజూరుకాగా వీటిలో ఇప్పటికే 100 పూర్తయినందున మిగిలిన వాటిని కూడా పూర్తిచేసేందుకు కృషిచేయాలన్నారు. గత నెల మూడో శనివారం పైలట్ ప్రాజెక్టుగా 1,350 ఇంకుడు గుంతలు మంజూరు చేయడం జరిగిందని.. జిల్లా అంతటా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. సరిహద్దు కందకాలతో పాటు ఉపాధి హామీ పథకం ద్వారా చిన్ననీటి జల వనరుల పునరుద్ధరణపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
సమావేశంలో డ్వామా పీడీ ఎ.రాము, భూగర్భ జలాల డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు, గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ విద్యా సాగర్ తదితరులు పాల్గొన్నారు.