విజయవాడ
చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా
గృహనిర్మాణ పథకం కింద అదనంగా రూ.50,000
జీఎస్టీని తొలగించేందుకు ప్రయత్నం
సాధ్యపడకపోతే కార్మికులు కట్టే మొత్తాన్ని రీయింబర్స్ చేస్తాం
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలపై సీఎం చంద్రబాబు వరాల జల్లు
నెలలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని ప్రజలకు పిలుపు
చేనేత కార్మికుల ఆరోగ్య భద్రత కోసం బీమా పథకాన్ని వెంటనే అమల్లోకి తెస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీనికి రూ.10 కోట్లను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. చేనేతకు భారంగా మారిన జీఎస్టీని ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. సాధ్యపడకపోతే కార్మికులు కట్టే జీఎస్టీ మొత్తాన్ని వారికి తిరిగి చెల్లిస్తామన్నారు. ఇందుకు రూ.67 కోట్లు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారన్నారు. త్రిఫ్ట్ ఫండ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వమిచ్చే వాటాను 8% నుంచి 16%కు పెంచుతామని, ఇందుకు రూ.10 కోట్లు అందిస్తామని తెలిపారు. కార్మికుల ఆదాయాన్ని పెంచేలా సమగ్ర పాలసీని తీసుకొస్తామన్నారు. విజయవాడలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. చేనేతలపై వరాల జల్లు కురిపించారు. ‘ఇళ్లలో మగ్గం పెట్టుకునే అవకాశం ఉన్నవారికి అక్కడే పెట్టిస్తాం. స్థలం అందుబాటులో లేకపోతే ఎక్కడికక్కడ 5 ఎకరాలు తీసుకుని సామూహికంగా మగ్గాలు ఏర్పాటుచేసి పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇళ్లు కూడా లేనివారికి కట్టుకోవడానికి వీలుగా ప్రభుత్వమే గృహనిర్మాణ పథకం కింద రూ.4.30 లక్షలు ఇస్తుంది. చేనేత కార్మికులు మగ్గాలు ఏర్పాటు చేసుకునేందుకు దీనికి అదనంగా మరో రూ.50వేలు అందిస్తాం’ అని ప్రకటించారు.
చేనేత కార్మికుల ఇళ్లపై ఉచితంగా సోలార్ పలకలు
చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్తు ఇస్తామని ఎన్నికల్లో చెప్పాం. వారు ఒక్క రూపాయి కూడా భరించకుండా పీఎం సూర్యఘర్ పథకం కింద ఇంటిపైనే సోలార్ పలకలను పెట్టి 200 యూనిట్లు ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. రాత్రిపూట పనిచేస్తే విద్యుత్తు అందిస్తాం. పగటిపూట ఉత్పత్తి చేసే విద్యుత్తును శాఖ తీసుకుంటుంది. అలా 200 యూనిట్ల విద్యుత్తు అందించే బాధ్యత తీసుకుంటాం. పవర్ లూమ్లకూ వర్తింపజేస్తాం. నెలలో ఒక్కరోజైనా ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. కార్మికులు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ద్వారా అమ్మకాలు చేపట్టేందుకు ప్రోత్సహిస్తాం. ఇందుకు శిక్షణ అందిస్తాం’ అని తెలిపారు.
అన్న క్యాంటీన్లలో అన్నదానానికి ముందుకు రావాలి
‘100 అన్నక్యాంటీన్లను ఆగస్టు 15న
ప్రారంభించబోతున్నాం. అన్నదానం చేయాలనుకునేవారికి
అన్నక్యాంటీన్లు మంచి అవకాశం. పుట్టినరోజు, పెళ్లిరోజు,
తదితర మంచి కార్యక్రమాలప్పుడు అన్నదానం చేయాలి.
అందరూ ముందుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని
కోరారు.
*బీసీ ఉపప్రణాళిక కింద రూ.1.50 లక్షల కోట్లు:*
‘పార్టీ పెట్టినప్పటి నుంచి తెదేపాకు బీసీలు అండగా నిలిచారు. వారికిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. బీసీ ఉపప్రణాళిక కింద 5 ఏళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చుచేస్తాం’ అని పేర్కొన్నారు.