చిన్నపత్రికలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మరింత ప్రచారం కల్పించాలి
యూనియన్ అన్నీ ఏకతాటిపైకి రావాలి – సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి
ఏపీఎస్ఎస్ డైరీని ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి
త్వరలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని పాత్రికేయులకు మంత్రి హామీ
అమరావతి, ఫిబ్రవరి 12 రాష్ట్రంలోని చిన్నపత్రికలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మరింత ప్రచారం కల్పించడంతో పాటు లబ్ధిదారులకు వాటి సమాచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బుధవారం సాయంత్రం వెలగపూడిలోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ పత్రికా సంపాదకుల సంఘం 2025 డైరీని మంత్రి పార్థసారథి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం పనితీరుపై ఎప్పుడూ విమర్శలే కాకుండా…. సంక్షేమ పథకాలపై పూర్తిస్థాయిలో ప్రత్యేక కథనాలు రాయడం వల్ల లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని మంత్రి పార్థసారథి అభిప్రాయపడ్డారు. చిన్నపత్రికలు ప్రధానంగా మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలలో ప్రాచుర్యంలో ఉన్నందున ఆయా జిల్లా ప్రజలకు మరింత చేరువ కావడానికి కృషి చేయాలన్నారు. నిజాలను వెలుగులోకి తీసుకురావడంలో పత్రికలు పోషిస్తున్న పాత్ర ఎంతో అభినందనీయమని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో కొంతమంది స్వప్రయోజనాలకోసం ప్రాకుల్లాడుతూ.. తమకు ఇష్టంవచ్చినట్లు వార్తా కథనాలు ప్రచురిస్తూ.. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాల్లో ముందున్నారని, అలాంటి వారికి ప్రజలే తగిన బుద్ది చెబుతారని చురకలు అంటించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలోని ప్రతికల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణను అమలు చేయాలన్నా కృత నిశ్చయంతో ఉన్నారని.. అందుకు సంబంధించిన శుభవార్త మీరంతా త్వరలో వింటారని మంత్రి అన్నారు. గడచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో వార్తాపత్రికలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న విషయాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పత్రికలంటే సీఎం చంద్రబాబుకు ఎంతో గౌరవమని, పాత్రికేయులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నారని అన్నారు. ప్రభుత్వంపై ఏదైనా వ్యతిరేకమైన కథనం ప్రచురించినట్లయితే.. దానిపై పూర్తిస్థాయిలో విచారణ చేయించే తత్వం ముఖ్యమంత్రిదని.. గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తే.. వారిని జైలుకు పంపిన దాఖలాలు ఉన్నాయని మంత్రి కొలుసు పార్థసారథి వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్లో రకరకాల పేర్లతో లెక్కకు మించి ఎన్నో జర్నలిస్టుల యూనియన్లు ఉన్నాయని.. యూనియన్లు అంతా కలిసికట్టుగా ఏకతాటిపైకి వస్తే.. ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడానికి ఎంతో సులువుగా ఉంటుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇబ్బడి ముబ్బడిగా యూనియన్లు ఉంటంతో… పరిష్కారానికి ఆస్కారం ఉండటం లేదని… తద్వారా రాష్ట్రంలోని జర్నలిస్టు మిత్రుల సమస్యలు ఎక్కడవి అక్కడే నిలిచిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే సమస్యపై వివిధ సంఘాల పేరుతో ప్రభుత్వానికి వినతి ప్రతాలు ఇవ్వడం మూలంగా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో మీడియా స్నేహితులంతా… ఏకతాటిపైకి రావడం ఎంతో అవసరమని, అలా చేయడం వల్ల సుధీర్గకాలంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం మరింత వేగవంతం అవతుందని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పత్రికా సంపాదకుల సంఘం డైరీ – 2025 ఆవిష్కరణ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు వీర్ల శ్రీరామ్యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు కూర్మా ప్రసాద్ బాబు, ముఖ్య సలహాదారుడు వి.వి.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రెడ్డి మానేపల్లి మల్లికార్జున రావు channel18Tv ఎడిటర్ తదితరులు పాల్గొన్నారు.