చిత్రావతి వంతెన నిర్మాణంపై మాట నిలబెట్టున్నా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

0
0

చిత్రావతి వంతెన నిర్మాణంపై మాట నిలబెట్టున్నా…

  • రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
  • బూదిలి వద్ద వంతెన నిర్మాణానికి భూమి పూజ
  • రూ.8.52 కోట్లతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం
  • 2027లోగా వంతెనను వినియోగంలోకి తీసుకొస్తా…
  • తొలి విడతలో ఇళ్ల స్థలాలు కలిగిన 56 మందికి ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు
  • రెండో విడతలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ
  • వలస పక్షుల రాజకీయంతో ఒరిగింది శూన్యం : మంత్రి సవిత విసుర్లు

గోరంట్ల/సత్యసాయి : ఎన్నికల ముందు బూదిలి పంచాయతీ వాసులకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నాని, 2027 నాటికి చిత్రావతి నదిపై వంతెనను నిర్మించి వినియోగంలోకి తీసుకొస్తానని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. గోరంట్ల మండలం బూదిలి పంచాయతీ చిత్రావతి నదిపై రూ.8.52 కోట్లతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి సవిత బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, చిత్రావతి వరదల సమయంలో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇదే విషయం సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లగా, చిత్రావతి నదిపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారన్నారు. రూ.8.52 కోట్లతో బూదిలి గ్రామం వద్ద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పీఎంజీఎస్ వై నిధులతో వంతెనను నిర్మించనున్నట్లు వెల్లడించారు. గడువులోగా బూదిలి వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని, 2027 నాటికి వినియోగంలోకి తీసుకొస్తామని మంత్రి సవిత స్పష్టంచేశారు.

నా మాట నిలబెట్టుకున్నా…

గత ఎన్నికల సమయంలో బూదిలి పంచాయతీ ఎన్నికల ప్రచానికి వచ్చిన సమయంలో వంతెన నిర్మాణ విషయమై పంచాయతీ వాసులు తన దృష్టికి తీసుకొచ్చారని మంత్రి సవిత గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలవగానే, బూదిలి వద్ద వంతెనను నిర్మిస్తానని హామీ ఇచ్చానని తెలిపారు. ఆ మాట ప్రకారం బూదిలి వాసులు తనను ఆదరించారని, వారికి ఇచ్చిన హామీ మేరకు వంతెన నిర్మాణానికి నిధులు రప్పించానని తెలిపారు. బూదిలి వాసులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు.

మరో రూ.20 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం

జాతీయ ఉపాధి హామీ నిధులతో గోరంట్ల మండలంలో రూ.6 కోట్లతో సీసీ రోడ్లు, కాలువలు నిర్మించామని, 70 గోకులం షెడ్లతో పాటు 40 నీటి తొట్టెలు ఏర్పాటు చేశామని మంత్రి సవిత తెలిపారు. బూదిలి పంచాయతీలో ఇప్పటికే రూ.20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, కాలువలు నిర్మించినట్లు వెల్లడించారు. మరో రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామన్నారు. నిధులు మంజూరుకాగానే, పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ ఏడాదిలో బూదిలి పంచాయతీలో 26 మందికి వైద్య సేవల నిమిత్తం రూ.26 లక్షల మేర సీఎంఆర్ఎఫ్ నిధులు అందజేశామన్నారు. పంచాయతీలో మొదటి విడతగా ఇళ్ల స్థలాలు కలిగిన 56 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. రెండో విడతలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

వలస పక్షులతో ఒరిగింది శూన్యం

వలస పక్షుల రాజకీయాలతో పెనుకొండ నియోజక వర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, వారి వల్ల ఒరిగిందేమీ లేదని మంత్రి సవిత విమర్శించారు. వైసీపీ పాలనలో నాటి పాలకులు వ్యక్తిగత లబ్ధికే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో చెప్పిన హామీలనే కాదు చెప్పని హామీలను కూడా అమలు చేసిందని వెల్లడించారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తోందని తెలిపారు. అంతకుముందు మంత్రి చిత్రావతి నదికి జలహారతి ఇచ్చి, పసుపు కుంకుమతో గంగమ్మకు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు కొల్లకుంట అంజినప్ప, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు నరసింహారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here