చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు కృషి.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
సీఎం చంద్రబాబు నాయుడు కి వినతిపత్రం సమర్పించి, ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 17.06.2024.
మెట్టప్రాంత రైతుల చిరకాల స్వప్నమైన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
గోదావరి జలాలను ఎత్తిపోసి ఏలూరు, పశ్చిమగోదావరి, ఉమ్మడి కృష్ణాజిల్లా మెట్టప్రాంతాలకు సాగు,తాగునీటిని అందించేందుకు ఉద్దేశించిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు సోమవారం పరిశీలించారు.
ముందుగా పోలవరం ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు కి చింతలపూడి ఎత్తిపోతల పథకం త్వరగా పూర్తి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కృష్ణప్రసాదు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో విభజింపబడిన ఏపీలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ మూడవ జోన్ కు సాగర్ జలాలు పూర్తిగా అందకపోవటంతో దానికి ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలను చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి కృష్ణాజిల్లా మెట్ట ప్రాంతానికి తీసుకురావడానికి రూ. 4,909 కోట్లు మంజూరు చేశారన్నారు.
ఈ పథకానికి 2019 నాటికి రూ. 4000 కోట్లకు పైగా ఖర్చు చేసి సుమారు 90 శాతం పూర్తి చేయటం జరిగిందని అన్నారు. ఈ పథకం పూర్తి చేయకపోవడంతో రైతులతో పాటు, వ్యవసాయంపై ఆధారపడిన ఎంతోమంది ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారని అన్నారు.
ముఖ్యంగా ఈ పథకంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు, మైలవరం, నూజివీడు, గన్నవరం, నందిగామ ఈ ఐదు నియోజకవర్గాలలో 18 మండలాలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుందని అన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని మూడవ జోన్ లో ఉన్న 2.36 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అంది ఆయకట్టు స్థిరీకరించబడుతుందన్నారు.
చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కోరుతూ సీఎం నారా చంద్రబాబునాయుడు ని కోరినట్లు వెల్లడించారు. ఎన్డీఏ మహాకూటమి, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.