గోసంతతిని కాపాడుకోవాలి
వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు0
గోసంతతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ.. బాలకృష్ణ గురుస్వామి చేపట్టిన గోరక్ష మహాపాదయాత్ర 112 వ రోజున విజయవాడకు చేరుకుంది. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై స్వామీజీని కలిసి యాత్రకు మల్లాది విష్ణు తన మద్ధతు తెలియజేశారు. గోమాత సకల దేవతా స్వరూపమని.. అటువంటి గోవు విశిష్టత గూర్చి దేశవ్యాప్తంగా చాటిచెబుతూ బాలకృష్ణ గురుస్వామి యాత్ర చేపట్టడం అభినందనీయమని మల్లాది విష్ణు అన్నారు. గోవుకు ఇరుముడి కట్టి శబరిమలై తీసుకువెళ్లడం చరిత్రలోనే ప్రప్రథమమని పేర్కొన్నారు. మానవజాతి మనుగడకు అనాదిగా గోమాత చేస్తున్న సేవ వెలకట్టలేనిదన్నారు. దేశానికి రైతు వెన్నెముక అయితే.. ఆ రైతుకు వెన్నెముక గోమాత అని చెప్పారు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నుంచి నేటి వరకు గోవు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. గోసంతతి లేకపోతే మానవ మనుగడకే ప్రమాదమని.. కనుక అంతరించిపోతున్న గోసంతతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్క భారతీయుడిపై ఉందని మల్లాది విష్ణు అన్నారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ.. తన మహాపాదయాత్ర గత ఏడాది సెప్టెంబర్ 27 న కాశ్మీర్లో ప్రారంభమై 14 రాష్ట్రాల మీదుగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. 180 రోజుల్లో 4,900 కి.మీ.నడిచి ఈ ఏడాది మార్చి 27న కన్యాకుమారిలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పుంగనూరు ఆవుకు హైదరాబాద్ లో అయ్యప్ప ఇరుముడి కట్టి తనతో పాదయాత్రలో తీసుకువెళ్తున్నట్లు తెలియజేశారు. గోసంతతిని రక్షించాలని ఈ గోవు ద్వారా శబరిమలలో అయ్యప్ప స్వామికి వినతి చేయనున్నట్లు వివరించారు. కనుక ప్రతిఒక్కరూ ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకుని తమ మద్ధతు తెలియజేయవలసిందిగా కోరారు.