Home Political news గిరి పుత్రులకు డోలీ కష్టాలు తీర్చండి విశాఖ ఏజెన్సీలో కనీస మౌలిక వసతులు కల్పించండి

గిరి పుత్రులకు డోలీ కష్టాలు తీర్చండి విశాఖ ఏజెన్సీలో కనీస మౌలిక వసతులు కల్పించండి

2
0

 గిరి పుత్రులకు డోలీ కష్టాలు తీర్చండి

విశాఖ ఏజెన్సీలో కనీస మౌలిక వసతులు కల్పించండి

 

హెల్త్ అసిస్టెంట్ (మేల్) పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేలా చూడండి 

జనసేన కేంద్ర కార్యాలయానికి రాష్ట్రవ్యాప్త వినతులు 

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు 

 వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్  

అధికారం పోయినా వైసీపీ నేతల ఆగడాలు ఆగడం లేదు. చాలా మంది అధికారులు వారికి సహకరిస్తున్నారని ఓ పారిశుద్ధ్య కార్మికురాలు ఆక్రందన. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా… విశాఖ ఏజెన్సీలో కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిపుత్రులు ఆవేదన. 

వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న హెల్త్ అసిస్టెంట్ (మేల్) పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని నిరుద్యోగుల విజ్ఞప్తి. 

మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తోన్న ప్రజల నుంచి వినతుల స్వీకరణ కార్యక్రమానికి మంగళవారం వచ్చిన అర్జీలు ఇవి. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్  తీసుకున్నారు. అధికారులతో మాట్లాడి ఫిర్యాదులు వెంటనే పరిష్కారం అయ్యేలా చొరవ చూపారు.   

•    బేడ, బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చేలా కృషి చేయాలని బేడ, బుడగ జంగం సంక్షేమ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. పదిహేనుళ్లుగా కుల ధ్రువీకరణ పత్రాలు లేక అనేక సంక్షేమ పథకాలకు తాము దూరమయ్యామని వాపోయారు. చదువు మధ్యలోనే ఆగిపోయి తీవ్రంగా నష్టపోయిన విద్యార్థులు ఎందరో ఉన్నారని తెలిపారు. బుడగ జంగం కులం స్థితిగతుల అధ్యయనానికి  ప్రభుత్వం నియమించిన జె.సి.శర్మ కమిషనర్‌ సమర్పించిన నివేదిక బుట్టదాఖలయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

•    వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న హెల్త్ అసిస్టెంట్ (మేల్) పోస్టులను తక్షణమే భర్తీ చేసేలా చూడాలని నిరుద్యోగ పారా మెడికల్ హెల్త్ అసిస్టెంట్ అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, గత 25 ఏళ్లుగా ఎటువంటి నోటిఫికేషన్ విడుదల కాలేదని వాపోయారు. మలేరియా, క్షయ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి చికిత్స అందించడంలోనూ.. గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాలలో సీజనల్, అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ హెల్త్ అసిస్టెంట్ మేల్ పాత్ర చాలా కీలకమని చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేలా చేసి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు.  

•    అటవీ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా 18 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాము. ఏలూరు డివిజన్ కొల్లేరు అభయారణ్యంలో ఎఫ్.ఎస్.ఒ.,ఎఫ్.బి.వొ., ఎ.బి.ఒ.లుగా సేవలందిస్తున్నాము. మమ్మల్ని క్రమబద్ధికరించాలని గత ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఎలక్షన్ కోడ్ వల్ల అది కుదరలేదు.  మా ఉద్యోగాలను రెగ్యులైజేషన్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని అటవీశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.  

•    అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్  కొక్కిరిగడ్డ లక్ష్మి, ఆమె భర్త నర్సింహమూర్తి, తన వద్ద రూ.30 వేలు దౌర్జన్యంగా లాక్కున్నారని పారిశుద్ధ్య కార్మికురాలు మీసాల దుర్గాదేవి ఫిర్యాదు చేశారు.  తనతోపాటు మరో ఇద్దరి దగ్గర కూడా ఇలానే బలవంతంగా డబ్బులు లాక్కున్నారని, డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన పాపానికి విధుల నుంచి తొలగించారని వాపోయింది. తమకు న్యాయం చేయాలని, తమ ఉద్యోగాలు తమకు వచ్చేలా చూడాలని కోరింది. 

•    స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా… అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి ఏజెన్సీ గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కలగానే మిగిలిపోయాయని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేశారు.  విద్యా, వైద్యం, ఉపాధి, రక్షిత తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే డోలీ ద్వారానే ఆస్పత్రికి వెళ్తున్నామని, తమ ప్రాంతంలో కనీస మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

•    పలువురు మహిళలు, దివ్యాంగులు తమ సమస్యలను చెప్పుకునేందుకు పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టుకున్నారు. వారందరి దగ్గర నుంచి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్  అర్జీలు స్వీకరించారు. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు  బండి రామకృష్ణ,  పగడాల శివపార్వతి,  బి.పార్వతి నాయుడు,  బొలిశెట్టి అన్నపూర్ణ,  వసంత లక్ష్మి, లీగల్ సెల్ నాయకులు  పి.ఆర్.కె. కిరణ్,  జేవీఎన్ మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here