Home Andhra Pradesh గన్నవరం నియోజకవర్గ అభివృద్దే ఏకైక లక్ష్యం

గన్నవరం నియోజకవర్గ అభివృద్దే ఏకైక లక్ష్యం

3
0

 గన్నవరం నియోజకవర్గ అభివృద్దే ఏకైక లక్ష్యం

శాసనసభలో మాట్లాడిన మాటలను సైతం వక్రీకరించడం అనైతికం

*శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణ వేదికను ప్రారంభించిన ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు*

గన్నవరం నియోజకవర్గ కేంద్రమైన గన్నవరం పట్టణంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానం యొక్క ఆలయ పాలకవర్గం నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణ వేదికను ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు ఈరోజు ఉదయం రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు.

శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణ వేదిక ప్రారంభోత్సవానికి హాజరైన యార్లగడ్డ వెంకట్రావును ఆలయ పాలకవర్గం కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతించి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికను వేదమంత్రోచ్ఛారణల మధ్య రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఆలయ పాలకవర్గ సభ్యులను అభినందించారు. త్వరలోనే తాను కూడా రెండు లక్షల రూపాయలను ఆలయ కమిటీ వారికి అందజేయనున్నట్లు తెలిపారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నానని గన్నవరం ముఖచిత్రం మార్చే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇటీవల శాసనసభలో తాను ప్రసంగిస్తూ గత వైసిపి ప్రభుత్వ హయాంలో కృష్ణాజిల్లాలోని పి.ఎ.సి.ఎస్ ల పరిధిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని దీనిపై ఎంక్వయిరీ చేసి రైతుల సొమ్మును అక్రమంగా కాజేసిన వారిని శిక్షించాలని సంబంధిత మంత్రివర్యులను కోరగా, ఒక వర్గం మీడియా దీనిని సైతం వక్రీకరిస్తూ వార్తలను చిత్రీకరిస్తున్నారని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. తన సొంత కంపెనీ కంటే ఎక్కువగా భావించి గతంలో తాను చైర్మన్ గా పనిచేసిన కేడిసిసి బ్యాంకును ఉన్నత స్థాయిలో నిలిపితే తనను విధుల నుంచి తప్పించి పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపారని మరోసారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 1962 వ సంవత్సరంలో మహానుభావులు పుచ్చలపల్లి సుందరయ్య గారు అధికారంలోకి వచ్చి ఉండుంటే గన్నవరం నియోజకవర్గం అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరి ఉండేదని అది జరగకపోవడం గన్నవరం ప్రజల దురదృష్టం అని తెలిపారు. అనంతరం గన్నవరం శాసనసభ్యులుగా వచ్చిన చాలా మంది నాయకులు చిన్న చిన్న పంచాయతీలలో సైతం ఏర్పాటు చేసి గన్నవరం నియోజకవర్గ అభివృద్ధిలో తమ మార్కు చూపించారని ఎప్పుడూ కూడా మట్టి జోలికి వెళ్లలేదని కానీ గత పది సంవత్సరాలు గన్నవరం నియోజకవర్గం అంటే మట్టే అనే విధంగా భావించి పెద్ద ఎత్తున అక్రమాలకు తెర లేపరని అన్నారు. తాను రాజకీయ జీవితంలో ఎప్పుడూ రాజీ పడలేదని రాబోయే కాలంలో కూడా రాజీ పడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలిపారు. ఎన్నికల ముందు తాను ప్రకటించిన సూపర్ సిక్స్ ను సాధించే క్రమంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ మీద దృష్టి సారించి అశోక్ లేలాండ్ కంపెనీని వెనక్కి తీసుకు వచ్చినట్లు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం, రామవరప్పాడు, ఎనికేపాడు, నిడమానూరు గ్రామాల్లో వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం దృష్టికి తెలిపానని, త్వరలోనే వాటిని ఏర్పాటు చేసి రైతులకు సౌలభ్యం కల్పిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్దే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నానని మరోసారి పునరుద్ఘాటించారు. 

ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దాసరి వెంకట బాలవర్ధనరావు, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానం యొక్క ఆలయ పాలకవర్గం సభ్యులు, భక్తులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here